కేసీఆర్ చెప్పింది ఏనాడూ చేయడు.!పెద్ద పిరికి వాడు.!హాలియా సభ తర్వాత రాములమ్మ ఘాటు కౌంటర్.!
హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాలియాలో నిర్వహించిన బహిరంగ సభతో రాజకీయం ఒక్కసారిగా వెడెక్కింది. ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చంద్రశేఖర్ రావుకు ధీటైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు విజయశాంతి హాలియాలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రసంగించిన తీరును పూర్తిగా విమర్శిస్తున్నారు.
కేసీఆర్ పై మండిపడ్డ విజయశాంతి..
బుదవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహిరంగ సభతో నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం మరింత జోరందుకుంది. హాలియాలో జరిగిన సీఎం చంద్రశేఖర్ రావు ప్రచార సభను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. సాగర్ ఉప ఎన్నిల్లో అధికార గులాబీ పార్టీకి ోటమి భయం పట్టుకుందని, హాలియా ప్రచార సభలో ఈ అంశం స్పష్టంగా కనిపించిందని విజయశాంతి పేర్కొన్నారు. సీఎం ప్రసంగంలో కొత్తదనం లేదని దుబ్బాక తరహాలోనే ప్రజలను మభ్య పెట్టేప్రయత్నం చేసారు తప్ప మరోటి కాదని ఘాటుగా విమర్శించారు విజయశాంతి.
రాజకీయ వేడిపెంచిన హాలియా సభ..
అంతే కాకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు రానున్న రోజుల్లో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కూలిపోతుందని విజయశాంతి జోస్యం చెప్పారు . ఈ విషయం చంద్రశేఖర్ రావు కళ్లల్లో స్పష్టంగా కన్పిస్తోందని విజయశాంతి తెలిపారు. అంతే కాకుండా చంద్రశేఖర్ రావు పైకి కనిపించేంతటి ధైర్యం ఉన్న నాయకుడు కాదని, ఉద్యమ సమయంలో చాలాసార్లు పారిపోయారని గుర్తుచేసారు. తన బహిరంగ సభలకు ఆ రోజుల్లో ఎన్నోసార్లు మొహం చాటేస్తే చంద్రశేఖర్ రావును ఒప్పించి సమావేశాలకు పిలుపించుకున్న సందర్బాలు ఉన్నాయని విజయశాంతి గుర్తు చేసారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలపై విమర్శనాస్త్రాలు చేసిన విజయశాంతి..
అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కూడా విజయశాంతి విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రశేఖర్ రావుతో పాటు జానారెడ్డిలు తోడు దొంగలని, వారు తెర వెనక మంచి మిత్రులనే విషయాన్ని గుర్తుచేశారు. ఒప్పందం ప్రకారమే పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారని పేర్కొన్నారు. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చేసిన అవినీతిని సరైన సమయంలో ప్రజల ముందు ఉంచుతామని విజయశాంతి హెచ్చరికలు జారీచేసారు. హాలియాలో జరిగిన ప్రచార సభలో సీఎం చంద్రశేఖర్ రావు పోడు భూముల సమస్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.
Recommended Video
సాగర్ లో గులాబీ పార్టీ ఓటమి ఖాయం..
చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, ఒక్క ప్రజల రక్షణే కాకుండా నిరుద్యోగులు కూడా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారని విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేడ్కర్ జయంతికి కనీసం నివాళులర్పించలేని పరిస్థితిలో సీఎం చంద్రశేఖర్ రావు ఉన్నారని విమర్శించారు. అంతేకాకుండా, సీఎం చంద్రశేఖర్ రావు దొంగ నిరాహార దీక్ష వలన తెలంగాణ రాలేదని అభిప్రాయపడ్డారు. ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తామని టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్న విషయాన్ని విజయశాంతి గుర్తుచేశారు. సాగర్ ప్రజలు ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకుని అధికార పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని విజయశాంతి మండిపడ్డారు.