తెలంగాణాపై బీజేపీ మాస్టర్ ప్లాన్; ఎన్నికలే లక్ష్యంగా మోడీ పర్యటన; హైకమాండ్ కీలకఆదేశాలు!!
తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. బిజెపి అధినాయకత్వం అందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంపై బాగా ఫోకస్ చేస్తున్న బిజెపి, తాజాగా గతంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించింది తెలిసిందే. ప్రస్తుతం బిజెపి కార్యవర్గ సమావేశాలతో, పార్టీ శ్రేణుల్లో జోష్ తీసుకురావడంతో పాటు, అగ్రనేతలను రంగంలోకి దింపి దిశానిర్దేశం చేయనుంది. ఈ మేరకు వ్యూహం ఖరారైంది.

జులై 2,3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం
జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. సమావేశాల నిర్వహణ కోసం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్-హెచ్ఐసీసీ, హోటల్ తాజ్ కృష్ణ, నోవాటెల్, ఇతర హోటళ్లు, రిసార్ట్లను పార్టీ నేతలు పరిశీలించారు. జాతీయ కార్యవర్గ సమావేశం జరిగే స్థలాలను పార్టీ జాతీయ ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, ప్రేమేందర్ రెడ్డిలు పరిశీలించారు.

బీజేపీ కార్యవర్గ సమావేశాలకు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా తదితర ప్రముఖులు
ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ప్రధాని, హోంమంత్రి, ఇతర ప్రముఖులు హైదరాబాద్లోనే ఉంటారని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని రెండు రోజుల పాటు రాజ్భవన్లో బస చేస్తారని, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లోని ప్రముఖ హోటళ్లలో బస చేస్తారని కూడా వారు పేర్కొన్నారు.

పార్టీ బలోపేతం చెయ్యటం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న అగ్రనేతలు
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ ఇటీవలే ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు బిసి మోర్చా అధ్యక్షుడు మరియు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ను నామినేట్ చేసింది. హైదరాబాదులో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని అగ్ర నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ కార్యవర్గ సమావేశాలకు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయవర్గాల దృష్టి బీజేపీ కార్యవర్గ సమావేశాల పై ఉంది.

బీజేపీ కార్యవర్గ సమావేశాలు .. హైకమాండ్ ఆదేశాలు
ఇదిలా ఉంటే హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థం అయ్యేలా చూడాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించినట్లు గా తెలుస్తోంది. సమావేశాల గురించి ప్రతి బూత్ స్థాయిలో తెలిసేవిధంగా, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ సైన్యం ముందుకు సాగే విధంగా చెయ్యాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే రాష్ట్ర స్థాయి నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే రోజు భారీగా ఏర్పాట్లు చేయాలని, ఘన స్వాగతం పలకాలని, ప్రజలతో స్వాగత కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

కార్యవర్గ సమావేశాలకు ప్రముఖులు.. ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలు
వివిధ రాష్ట్రాల నుంచి సీఎంలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నివాసముండే ఆయా రాష్ట్రాల ప్రజలతో ప్రత్యేక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కార్యవర్గ సమావేశానికి జేపీ నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఒకరోజు ముందే రానున్నారు. బిజెపి పూర్తి అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కార్యవర్గ సమావేశాలపై ఇంతగా ఫోకస్ చేస్తుండడంతో బీజేపీ తెలంగాణకు ఎంత ప్రాధాన్యతనిస్తుంది అనేది ప్రజలకు తెలిసేలా చూడాలని అధినాయకత్వం రాష్ట్ర బిజెపి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఏది ఏమైనా ఇటీవల కాలంలో బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ చేస్తున్న తీరు తెలంగాణలో రాజకీయ పరిణామాలను ఏ విధంగా మారుస్తాయి అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications