317జీఓ కారణంగా మరణాలు ప్రభుత్వ హత్యలే; కేసీఆర్ పై నల్గొండలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్
బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు 317 జీఓతో హుజూర్ నగర్ జెడ్పిహెచ్ఎస్ క్యాంప్ స్కూల్ లో జాయిన్ అవ్వడానికి వెళ్లిన రికార్డు అసిస్టెంట్ నాగిళ్ల మురళీధర్ హార్ట్ఎటాక్ తో చనిపోవడంతో ఆయన స్వస్థలమైన నర్సింగ బట్లలో రికార్డు అసిస్టెంట్ నాగిళ్ల మురళీధరరావుకు నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కెసిఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రాణాలు పోతున్నాయని, ఆవేదనతో వారి గుండె ఆగిపోతుందని రఘునందన్ రావు పేర్కొన్నారు.
తెలంగాణా పోలీసులకు పింక్ డ్రెస్; గవర్నర్ కు, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తాం: తరుణ్ చుగ్
తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగుల ఆకస్మిక మరణాలు, ఆత్మహత్యలు
పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, విద్యార్థులు ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి అని, ఇక ఇప్పుడు ఉద్యోగుల ఆత్మహత్యలు, ఆకస్మిక మరణాలు కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీఓ వల్ల ప్రభుత్వ ఉద్యోగులు గుండె ఆగి చనిపోతున్నారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. 317 జీఓ ను సవరించాలని ఉద్యోగులు అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు.
317 జీఓను సవరించే వరకు బీజేపీ పోరాటం
టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీఓను సవరించే వరకు బీజేపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆత్మహత్య లు చేసుకోవద్దని రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఉద్యోగ సంఘాలతో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని, అలా కాకుండా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని రఘునందన్ రావు తెలిపారు.
కేసీఆర్ కు ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసులు పెట్టటం, జైలుకు పంపటంపై దృష్టి
317 జీఓ గురించి బండి సంజయ్ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తే టెర్రరిస్టులను చూసినట్టు చూశారని, కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టు చేశారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు ప్రతిపక్ష నాయకుల మీద ఎలా కేసులు పెడదాము, జైలుకు ఎలా పంపిద్దాం అనే ధ్యాస తప్ప ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలనే, వారిని ఆదుకోవాలనే ధ్యాస లేదని రఘునందన్ రావు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 317 జీఓ వల్ల చనిపోయిన వారి మరణాలు ప్రభుత్వ హత్యలుగా పోలీసులు పరిగణించాలని, కేసులు నమోదు చేయాలని తెలిపారు.
317 జీఓ వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు పరిహారం డిమాండ్
317 జీఓ వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగంతోపాటు 50 లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ప్రభుత్వం తరుపున సానుభూతి కూడా తెలియజేయడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మురళీధర్ రావు కుటుంబానికి ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ తరుపున 25 వేలు చెక్కును అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ధైర్యంగా ఉండాలని, 317 జీఓ సవరించే దాకా పోరాటం చేద్దామని రఘునందన్ రావు పేర్కొన్నారు.