కెసిఆర్కూ షాక్: తెలంగాణపై పట్టుకు ఇదీ ‘కమలం’ కార్యాచరణ
తెలంగాణపై పట్టుబిగించేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తున్నదా? అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడంపై తీవ్రంగా దృష్టి సారించిందా? అంటే తాజా పరిణామాలు మాత్రం అవుననే అంటున్నాయి.
హైదరాబాద్: తెలంగాణపై పట్టుబిగించేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తున్నదా? అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడంపై తీవ్రంగా దృష్టి సారించిందా? అంటే తాజా పరిణామాలు మాత్రం అవుననే అంటున్నాయి. అందుకోసం రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీలను అక్కున చేర్చుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తున్నది.
అంతే కాదు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు రాష్ట్రంలో అండగా ఉన్న సామాజిక వర్గాలపైనా కమలనాథులు గురి పెట్టారు. అంతటితో ఆగకుండా అధికార టీఆర్ఎస్లోని అసంతృప్తులను సైతం గుర్తించే పనిలో పడిందని తెలుస్తోంది. దక్షిణాదిన కర్ణాటక తర్వాత తమకు అత్యంత అనువైన రాష్ట్రం తెలంగాణ అని గుర్తించిన ఆ పార్టీ నాయకత్వం అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది.

కాంగ్రెస్ ఉనికే లేదన్న సంకేతాలకు యత్నాలు
ప్రస్తుతానికి మూడో కంటికి తెలియకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేరుగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో ఏమాత్రం బలపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నించకపోవడాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకు ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా ఈ ఏడాది చివరికి నాటికి రాష్ట్ర కాంగ్రెస్లో అతి ముఖ్యమైన వారీగా భావిస్తున్న ఓ అర డజను మందిని బీజేపీలోకి చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేదన్న భావన కలిగించాలని చూస్తోంది. ముఖ్యులైన నేతలను పార్టీలో చేర్చుకుంటే క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ కూడా బీజేపీలోకి వస్తుందన్నది ఆ పార్టీ అంచనా. అదే జరిగితే కాంగ్రెస్లో మిగిలిన వారిలోనూ నైరాశ్యం పెంచడం ద్వారా తామే ప్రత్యామ్నాయమని వారంతా తమ పార్టీ వైపు చూడడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ ఆశిస్తోంది.
Recommended Video


అందుకే అసెంబ్లీ స్థానాల పెంపును అడ్డుకున్నట్లు కమలదళం
టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమే బలమైన నమ్మకం కలిగించేందుకు ఇప్పటిదాకా జాతీయ స్థాయిలో చేస్తున్న తెరచాటు ప్రయత్నాలు దసరాకల్లా బహిర్గతమయ్యే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ‘ఇక్కడ పార్టీని అధికారంలోకి తేవాలన్న లక్ష్యం మా పార్టీ అధినాయకత్వానికి ఉంది. దానికి తగ్గట్టే మేం ఒక ఎజెండాతో ముందుకు పోతున్నాం. దానిలో భాగంగానే నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను మా పార్టీ చెత్త బుట్టదాఖలు చేసింది'' అని ఆయన చెప్పారు. కాంగ్రెస్కు ఇంతకాలం అండగా ఉంటూ వస్తున్న ఓ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలను చేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.

బీజేపీ నేతలతో చర్చలను ధ్రువీకరిస్తున్న కాంగ్రెస్ నేతలు
ప్రజల్లో మంచి పేరు గల కాంగ్రెస్ నాయకులపై బీజేపీ అధినాయకత్వం గురి పెట్టింది. ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న ఐదుగురితోపాటు ఓ శాసనమండలి సభ్యుడితో ఆ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. తమ పార్టీలో చేరితే వారికి దక్కే ప్రాధాన్యం, భవిష్యత్లో ఉండే అవకాశాలపై వారికి స్పష్టతనిచ్చినట్లు తెలిసింది. ‘‘అవును.. నాతో బీజేపీ సీనియర్ నేతలు ఇద్దరు పలుమార్లు చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునే దిశగా పార్టీ ప్రయత్నాలు కనిపిస్తే చేరడానికి సుముఖమేనని వారికి చెప్పాం. కానీ ఇప్పటిదాకా వారి ప్రయత్నాలు అంతర్గతంగానే కొనసాగుతున్నాయి. నాకు తెలిసి దసరా నాటికి కాంగ్రెస్కు చెందిన పలువురు నాతోపాటు బీజేపీలో చేరే అవకాశం ఉంది'' అని కాంగ్రెస్కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు.

దసరా నాటికి ప్రధాన వలసలు
వీరే కాక ప్రజల్లో మంచి పేరున్న ఇతర సీనియర్ నేతలతోనూ ఆ పార్టీ సంప్రదింపులు జరుపుతోంది. ఇవి బయటకు పొక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనిపై బీజేపీ స్థానిక నేతలు కూడా సమాచారం లేకుండా వ్యవహరిస్తోంది. వచ్చే దసరా నాటికి కాంగ్రెస్ నుంచి ప్రధాన వలసలు ఉంటాయని, అప్పటికి తమ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.ఇటీవల నల్లగొండ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని గంగవెర్రులెత్తించారు.

నమ్మకం కలిగితే కారు వీడేందుకు నేతలు రెడీ
తొలుత టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమన్న నమ్మకం కలిగించాకే టీఆర్ఎస్లో అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకోవాలన్నది కమలనాథుల లక్ష్యంగా ఉంది. అలాంటి కొందరు నేతల జాబితాను ఆ పార్టీ ఇప్పటికే సిద్ధం చేసుకున్నదని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కీలకంగా మారబోతోందని, పార్టీలో చేరితే మంచి భవిష్యత్ ఉంటుందని వారికి నచ్చజెప్పే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. తాము పార్టీలో చేరేందుకు సుముఖమేనని, అయితే రాష్ట్రంలో ప్రత్నామ్నాయం ఇక బీజేపీయే అన్న నమ్మకం కలిగితే ఆలోచిస్తామని దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ టీఆర్ఎస్ ఎంపీ, ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నాయకత్వానికి చెప్పినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావని భావించేవారితోపాటు టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న వారు కూడా చేరుతారని బీజేపీ నేతలకు సదరు ఎంపీ బీజేపీ చెప్పినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications