ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలపై అమిత్ షా ఫోకస్: రెండు రాష్ట్రాల నేతలకు ‘హస్తిన’ పిలుపు
హైదరాబాద్: ఎట్టకేలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై ద్రుష్టి సారించారని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థాగతంగా బీజేపీ స్థితిగతులు, తెలంగాణలో టీఆర్ఎస్ దూకుడు, ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షం టీడీపీతో అనుబంధం తదితర అంశాలపై పార్టీ నేతలతో సంప్రదించనున్నారని తెలుస్తోంది. వాస్తవంగా మంగళవారమే టీడీపీ పార్లమెంట్ సభ్యులు.. అమిత్ షా సమావేశం కావాల్సి ఉన్నా చివరి క్షణంలో అర్థంతరంగా వాయిదా పడింది.
టీడీపీ నేతలతో భేటీకి ముందు అసలు తెలుగు రాష్ట్రాల్లో వాస్తవిక పరిస్థితేమిటో తెలుసుకోవాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. అలాగే అసెంబ్లీ సీట్ల పెంపుపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల వైఖరి తెలుసుకోనున్నారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు తమతో సమావేశం కావడానికి 'హస్తిన' నుంచి పిలుపు అందింది.
తెలుగు రాష్ట్రాల నేతలతో వేర్వేరుగా భేటీలు
ఏపీలో మిత్రపక్షం టీడీపీతో పొత్తుపై కొందరు బీజేపీ నేతల విమర్శల పర్వం.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్పై పోరాడాల్సిన తీరుపై కొరవడిన స్పష్టత.. రెండు రాష్ట్రాల నుంచి అసెంబ్లీ స్థానాల పెంపునకు డిమాండ్లు. మరోవైపు ‘ముందస్తు - జమిలి' ఎన్నికలపై సాగుతున్న ఊహాగానాలు. వీటన్నింటి మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో ఇరు రాష్ట్రాల ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, సీనియర్ నేతలు పురందేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలకూ.. తెలంగాణ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి, సీనియర్ నేత దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్లకు ఢిల్లీ నుంచి పిలుపు అందింది. అమిత్ షాతో జరిగే భేటీలో అసెంబ్లీ సీట్లను పెంచడంతోపాటు రెండు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ, అనేక ఇతర రాజకీయ అంశాలు చర్చకు రానున్నాయి.
తెలంగాణలో సీట్ల పెంపునకు బీజేపీ నేతలు ససేమిరా?
రెండు రాష్ట్రాల్లోని అధికార టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలని గట్టిగా కోరుకుంటున్నాయి. కానీ అసెంబ్లీ స్థానాల పెంపుతో టీఆర్ఎస్కు మేలు జరుగుతుందంటూ తెలంగాణ బీజేపీ నేతలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. తాజా పరిణామాల దృష్ట్యా, గురువారం జరిగే సమావేశంలో దీనిపై ఎలాంటి చర్చ జరుగుతుందన్నది ఆసక్తికరంగానే ఉంటుందని బీజేపీ తెలంగాణ ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయమై విభజన సమస్యలు, పార్టీ పరంగా ఉన్న ఇబ్బందులు, టీడీపీ స్నేహబంధంపై భిన్నాభిప్రాయాలు, పార్టీలో గ్రూపులు తదితర అంశాలపై అమిత్షా చర్చించే అవకాశం కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై అమిత్ షా ఫోకస్
టీడీపీతో సంబంధాలు కొనసాగించే విషయంలో బీజేపీలోనే రెండు వర్గాలు ఏర్పాటయ్యాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడంపై అమిత్షా దృష్టి సారిస్తారని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో ప్రధాన సమస్యలు, కేంద్రం పరిష్కరించాల్సిన అంశాలు, కేంద్రంపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశాలపైనా దృష్టి సారించే అవకాశముంది. పార్టీ బలోపేతానికి ఎవరెవరు ఏం చేస్తున్నారో నిర్దిష్టంగా అడుగుతారని తెలుస్తోంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ విధానాలు, బీజేపీలోకి వలసలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అమిత్షా చర్చించనున్నారు. పనిలో పనిగా ఆయా నేతల వ్యాపార, వ్యవహారాలు, రాజకీయాలపై తన వద్ద ఉన్న అంతర్గత నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ పార్టీకోసం చిత్తశుద్ధితో పని చేయని వారిని అమిత్ షా గట్టిగా మందలిస్తారనే సమాచారం ఉంది.
గుజరాత్ నమూనాలో గెలుపునకు తెలంగాణ బీజేపీ వ్యూహం
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పట్ల ఎలాంటి వైఖరి అనుసరించాలన్న విషయంపై అధిష్ఠానం స్పష్టత ఇవ్వడంలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ‘కేంద్ర మంత్రులు తరుచూ వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని భావిస్తున్నాం. 23 వేలమందితో ఇప్పటికే బూత్ కమిటీలను వేశాం. 105 మంది పూర్తి స్థాయి నేతల్ని నియమించాం. త్వరలో గుజరాత్ నమూనాలో ప్రముఖ్లను కూడా నియమిస్తాం. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఉధృతంగా రంగంలోకి దిగి కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహరాలను ప్రజల ముందు ఉంచుతాం' అని తెలిపారు.
ఇన్ చార్జి లేని ‘ఏపీ'లో కమలనాధుల ఇష్టారాజ్యం
ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీతో పొత్తు విషయమై గందరగోళం సాగుతోంది. ఒకానొక దశలో ‘నమస్కారం' పెట్టి సెలవు తీసుకుంటామని ఏపీ సీఎం - టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తేల్చి చెప్పారు. టీడీపీపైన, దానితో పొత్తుపైన ఏపీలో బీజేపీ నేతలు ఇటీవల తరచుగా తలోమాట చెప్తున్నారు. పార్టీకి రాష్ట్రంలో దిశానిర్దేశం చేసే నేత లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది! దిశానిర్దేశం చేస్తూ నాయకులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంపై ప్రస్తుతం బీజేపీ అధిష్ఠానానికి ఆసక్తి ప్రదర్శించడం లేదని విమర్శలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సిద్ధార్థ్నాథ్సింగ్ చేరిన నాటి నుంచి రాష్ట్ర ఇన్చార్జి స్థానం ఖాళీగా ఉన్నా భర్తీ చేసేందుకు అధిష్ఠానం ప్రయత్నించకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీని ఎలా విస్తరించాలన్న దానిపై అధినేత అమిత్షా దగ్గర బ్లూప్రింట్ సిద్ధంగానే ఉందని ఓ బీజేపీ సీనియర్ నేత చెప్పారు. ఇన్చార్జి లేకున్నా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకైనా పరిస్థితిని చక్కదిద్దేందుకు అనుమతి లభించడం లేదని సమాచారం.