అసోంలో బీజేపీ గెలుపు: చక్రం తిప్పిన తెలుగోళ్లు!, ఆ 'తెలివి'కి కేంద్రమంత్రి పదవి?
హైదరాబాద్: అసోంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టింది. ఈశాన్య రాష్ట్రాలలో తొలిసారి అధికారం చేపట్టి చరిత్ర సష్టించింది. గత ఎన్నికల్లో 5 స్థానాల నుంచి ఈసారి ఏకంగా మిత్రపక్షంతో కలిపి 86, సొంతగా 70 స్థానాలకు పైగా బీజేపీ గెలుచుకుంది.
అసోంలో బీజేపీ గెలవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మన తెలుగోళ్ల పాత్ర కూడా ఉంది. అందులో ఒకరు రామ్ మాధవ్. రెండోవారు పేరాల శేఖర్. అసోంలో ఎన్నికల వ్యూహంలో వీరు కూడా చక్రం తిప్పారు.
బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్. ఆయన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంకు చెందిన వారు. అసోంలో బీజేపీ గెలుపు వెనుక వీరు కీలక పాత్ర పోషించారు. ఇతను గత ఏడాది కాలంగా అసోంలో బీజేపీ గెలుపు కోసం పావులు కదుపుతున్నారు.
రాష్ట్ర స్థాయి నేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు ఆయన చాలామందిని కలిశారు. అసోం గెలుపు నేపథ్యంలో రామ్ మాధవ్ ప్రాధాన్యత బీజేపీలో మరింత పెరిగిందని అంటున్నారు. అంతేకాదు, ఇతనిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు.
మరో నేత పేరాల శేఖర్. ఈయన కూడా అసోంలో బీజేపీ కోసం బాగా పని చేశారు. ఇతను కూడా గత కొద్ది నెలలుగా అక్కడే తిష్ట వేశారు. పేరాల శేఖర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. అతను నెహ్రూ యువ కేంద్ర సంఘటన్కు వైస్ చైర్మన్.
అసోంలో బీజేపీ గెలుపుపై పేరాల శేఖర్ మాట్లాడుతూ.. అసోం లాగే తెలంగాణ, ఏపీలలోను బీజేపీ విజయభావుటా ఎగురవేస్తుందని చెప్పారు. తెలంగాణలో తెరాసకు, ఏపీలో టిడిపికి తామే ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు. రామ్ మాధవ్ మాట్లాడుతూ.. ఈ గెలుపు బీజేపీ కార్యకర్తలది అన్నారు.