వరంగల్ జిల్లాలో కిషన్ రెడ్డి అరెస్ట్, ఓట్ల కోసమే: టిఆర్ఎస్ వినోద్
వరంగల్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గురువారం అరెస్టయ్యారు. ఉదయం ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం నుంచి తన యాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు.
దేవాదుల ప్రాజెక్టు వరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి దీనిని చేపట్టారు. ఈ యాత్రలో భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు పాలుపంచుకున్నారు.
అయితే, ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేపట్టిన కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా కంతనపల్లి ప్రాజెక్టు వద్ద కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు. కిషన్ రెడ్డి కంతనపల్లి నుంచి దేవాదుల వరకు పాదయాత్ర చేపట్టాలని భావించారు.

ఓట్ల కోసమే: వినోద్ కుమార్
కంతనపల్లి ప్రాజెక్టు పేరిట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర పైన అంతకుముందు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఆ పాదయాత్ర కేవలం ఓట్ల కోసమేనన్నారు. త్వరలో జరిగే వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వంపై ఇలా ప్రచారం చేస్తున్నాయన్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీఆర్ఎస్ ఎంపీ వినోద్ బహిరంగ లేఖ రాశారు. దీనిపై వినోద్ మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యల పాపం కాంగ్రెస్దే అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 23,556 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఓట్ల కోసం రైతులను రెచ్చగొట్టొద్దన్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయని, ఉప ఎన్నికలు టీఆర్ఎస్కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతారన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కాళేశ్వరం.. కంతనపల్లి కంటే మంచి ప్రాజెక్టు అన్నారు.
రీడిజైన్ అంటే డబ్బుల కోసం మారుస్తున్నారని విమర్శించడం సరికాదన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు దగ్గర తట్టెడు మట్టి తీయని వారు చేవెళ్లలో టన్నెల్ తవ్వి దోచుకున్నారన్నారు.












Click it and Unblock the Notifications