టీఆర్ఎస్ టార్గెట్ గా అసంతృప్తులకు బీజేపీ గాలం; చేరికలపై స్పీడ్ పెంచాలన్న అధినాయకత్వం
తెలంగాణ రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే బిజెపి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దించి ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై బిజెపి ముఖ్య నాయకులు నిర్వహించిన సమావేశంలో బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ అసంతృప్తనేతలను పార్టీలోకి తీసుకురావాలన్న తరుణ్ చుగ్
అధికార పార్టీలోని అసంతృప్త నేతలను లక్ష్యంగా చేసుకుని వారిని బీజేపీ గూటికి చేర్చాలని సమావేశంలో తరుణ్ చుగ్ పేర్కొన్నారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ఎవరు అంటరానివారు కాదని విశ్వసిస్తోంది అని పేర్కొన్నారు. తరుణ్ చుగ్ టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల టీఆర్ఎస్ నేతలు పలువురు అసంతృప్తి తో ఉన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు అంటూ వెల్లడించారు.వివిధ స్థాయిల్లో కమిటీలు వేసి అలాంటి టీఆర్ ఎస్ నేతలను గుర్తించి పార్టీలోకి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నేతలకు చుగ్ చెప్పారు.
బీజేపీ చేరికలపై ఫోకస్ చెయ్యాలన్న తరుణ్ చుగ్
టిఆర్ఎస్ నుండి బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నవారు తమ వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టాలని, దేశం కోసం, పార్టీ కోసం పని చేయాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ నాయకత్వానికి చెక్ పెట్టాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కేసీఆర్ ముక్త్ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు. బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న వారి విషయంలో చర్చలు జరపడానికి సీనియర్ నేత ఎన్ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో బీజేపీ ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. ఇక కమిటీ కార్యాకలాపాలపైనా ఆయన అడిగి తెలుసుకున్నారు.
పార్టీని బలోపేతం చెయ్యాలని సూచన
అయితే టీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకోవడానికి 119 నియోజకవర్గాలలో చాలా వరకు బలంగా లేదని, పార్టీని బలోపేతం చేయాలని సూచించారు తరుణ్ చుగ్ . రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులను ఆకర్షించడం ద్వారా అధికార పక్షాన్ని ఢీకొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్తో కలిసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేసిన ఆయన టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులను త్వరిత గతిన పార్టీలో చేర్చుకునేందుకు దృష్టిసారించాలని తెలిపారు.
తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తుందన్న తరుణ్ చుగ్
2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని చుగ్ అన్నారు. ఇది నేను మాత్రమే చెప్పడం కాదు. ఇదే రాష్ట్ర ప్రజలు చెబుతున్న మాట అని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తుందని, టీఆర్ఎస్ కథ ఎప్పటికైనా ముగుస్తుందని ఆయన అన్నారు. మే 30 నుంచి పక్షం రోజుల పాటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, విప్లవాత్మక ప్రజానుకూల నిర్ణయాల గురించి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయాలని చుగ్ అన్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది: బండి సంజయ్
రాష్ట్రంలో ఇటీవల జరిగిన మూడు బహిరంగ సభలు, టీఆర్ఎస్ ప్లీనరీ, రాహుల్ గాంధీ ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ సమావేశం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించిన బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర భవిష్యత్ ఎన్నికలలో విజయం బీజేపీదేనని స్పష్టం చేశాయని బండి సంజయ్ అన్నారు. ప్రజలు ఇదే చెబుతున్నారని, రాష్ట్రంలో ఇటీవల జరిగిన మూడు సర్వేలు కూడా ఈ విషయాన్ని వెల్లడించాయని, రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ల పరిస్థితి బాగా దిగజారిందని సర్వేలు చెబుతున్నాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మొత్తంగా చేరికలపై ప్రధానంగా దృష్టి సారించాలని బిజెపి అధినాయకత్వం చేసిన దిశానిర్ధేశం మేరకు బిజెపి రాష్ట్ర నాయకత్వం పని చేయనుంది.