బీజేపి,టీఆర్ఎస్ దొంగాటలో రైతులు బలి.!డ్రామాలు ఆపి ధాన్యం ఎప్పుడు కొంటారో చెప్పాలన్న కాంగ్రెస్.!
హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర విధానాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ధాన్యం కొనకుడా డ్రామాలాడుతూ సన్నివేశాలను బాగా రక్తి కట్టిస్తున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పక్కన పెట్టి ఒకరినొకరు తిట్టుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని టీపీసీసీ నేతలు విమర్శిస్తున్నారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పుకొని ఒకరిని ఒకరు నీచంగా తిట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు.
సీఎం చంద్రశేఖర్ రావు రాబోయే ఎండాకాలం రబీ సీజన్ పంటలను కొనుగోలు చేయమని చెప్పడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పడం రైతులను అగాదంలోకి నెట్టేయడమేనని, దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరింస్తున్నారు టీపిసిసి నేతలు.
మంత్రి వర్గ సమావేశం దేనికి.?
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రైతులకు ఊరట కలిగించే విధంగా ప్రణాళికలు ప్రతిపాదనలు ఉంటాయని తెలంగాణ ప్రజలు ఆశించారని, చావు కబురు చల్లగా చెప్పినట్లు కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం చంద్రశేఖర్ రావు చెబుతున్నాడని, ఈ మాట చెప్పడానికి మంత్రివర్గ సమావేశం సుదీర్ఘ చర్చలు జరిపి తీసుకునే నిర్ణయం ఇదా.? అని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
ప్రధాని మోదీ, సీఎం చంద్రశేఖర్ రావు ఇద్దరు కలిపి దొంగ నాటకాలు ఆడుతున్నారని, తెలంగాణ హక్కులను సాధించుకుందాం పోరాటం చేస్తామన్న వ్యక్తి చావు కబురు చల్లగా చెప్పినట్లు కొనుగోలు కేంద్రాలు ఉండవని చెబుతున్నారని ఇది ఎంతవరకు సంమజసమని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.
రైతు సంక్షేమం కోసం ఒక్క నిర్ణయం తీసుకోలేదు..
కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యకపోతే మెడలు వంచి కొనుగోలు చేయిస్తానని చంద్రశేఖర్ రావు స్పష్టం చేసాడని, ఇప్పుడు ఆ శపధాలన్నీ ఏమయ్యాయని పొన్నాల లక్ష్మయ్య సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనేది లేదని మొండికేసి చెప్తున్నప్పుడు చంద్రశేఖర్ రావు తన పాలసీ ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన బాద్యత ఉందని గుర్తు చేసారు.
ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నానని చంద్రశేఖర్ రావు స్పష్టం చేస్తున్నప్పుడు అదే విధానాన్ని రైతులకు ఎందుకు చెప్పడంలేదని మండిపడ్డారు. బిజెపిని దూషిస్తే, ప్రధాని మోదీని నిలదీస్తే తెలంగాణ ప్రజలు హీరో అనుకుంటారని చంద్రశేఖర్ రావు భావిస్తున్నారని, కానీ ప్రజల ఆలోచనలు అందుకు విరుద్దంగా మారిపోయాయన్న వాస్తవం చంద్రవేఖర్ రావు గ్రహించక పోవడం శోచనీయమన్నారు పొన్నాల లక్ష్మయ్య.
ప్రెస్ మీట్ లో రైతులకు పనికొచ్చే మాట ఒక్కటైనా ఉందా.?
దేశంలో, రాష్ట్రంలో రైతులు గతంలో వ్యవసాయం చేయలేనట్టు, చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయినప్పటినుంచే వ్యవసాయం చేస్తున్నట్లు చంద్రశేఖర్ రావు కలరింగ్ ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. చంద్రశేఖర్ రావు గంట పదినిమిషాల విలేఖరుల సమావేశంలో రైతులకు ఉపయోగపడే అంశం ఒక్కటైనా మాట్లాడుతాడని అందరూ భావించారని కానీ బీజెపిని తిట్టడానికి మాత్రమే విలేఖరుల సమావేశం పెట్టినట్టు తర్వాత ప్రజలకు అర్ధం అయ్యిందని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది.
కేంద్రంలో ఉన్న పాలకులను దద్దమ్మలుగా అభివర్ణిస్తున్నప్పుడు ఏడున్నర సంవత్సరాలుగా రైతాంగానికి తమరు ఒరగబెట్టిందేమిటని చంద్రశేఖర్ రావును సూటిగా ప్రశ్నించారు.
అన్ని నిర్ణయాల్లో వెన్నంటే ఉన్న కేసీఆర్..
నోట్ల రద్దు, జిఎస్టి, 370 ఆర్టికల్ రద్దు, త్రిపుల్ తలాక్, వ్యవసాయ చట్టాలతో పాటు, రాష్ట్రపతి ,ఉప రాష్ట్రపతి, స్పీకర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి ఇప్పుడు దద్దమ్మ ప్రభుత్వం అంటున్నాడని, ఆ దద్దమ్మ ప్రభుత్వంతో అంతర్గతంగా పొత్తు ఎందుకు పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. షావుకార్లను అవమానపరుస్తూ ఒక వృత్తి మీద చంద్రశేఖర్ రావు ఇలాంటి ఆరోపణలు చేయడం శోచనీయమని పొన్నాల ఆవేదన వ్యక్తం చేసారు.
కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం తెరవకపోతే ధాన్యాన్ని ఎవరు కొంటారని, రాష్ట్రంలో పేదవాళ్లు ఎకరం, రెండెకరాల పొలం ఉన్నవాళ్లే లక్షల మంది ఉన్నారని, కౌలు రైతులు 15 లక్షల మంది ఉన్నారని గుర్తు చేసారు. దొంగే దొంగ దొంగ అన్నట్లు కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని చంద్రవేఖర్ రావు చెబుతున్నాడని, ఏడేళ్లుగా చంద్రశేఖర్ రావు చేసింది ఏమీ లేదా అని సూటిగా ప్రశ్నించారు.