విజృంభిస్తున్న 'బ్లాక్ ఫంగస్'... తెలంగాణలో ఒక్కరోజే నలుగురి మృతి... మరో ముగ్గురి పరిస్థితి విషమం...
'బ్లాక్ ఫంగస్' కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే కరోనా భయంలో ఉన్న జనాలు... 'బ్లాక్ ఫంగస్' కేసుల గురించి విని మరింత బెంబేలెత్తుతున్నారు. మహమ్మారి రోగాలన్నీ వరుసగా విరుచుకుపడుతుండటంతో అంతటా ఒకరకమైన ఆందోళనకర వాతావరణం నెలకొంది. తెలంగాణలో సోమవారం(మే 17) ఒక్కరోజే 'బ్లాక్ ఫంగస్' సోకిన నలుగురు పేషెంట్లు మృతి చెందారు. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నవారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బ్లాక్ ఫంగస్తో నలుగురు మృతి...
నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు,నల్గొండ జిల్లాకు చెందిన ఒకరు బ్లాక్ ఫంగస్తో సోమవారం మృతి చెందారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ రాష్ట్రంలో 10 మంది బ్లాక్ ఫంగస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో 16 మంది బ్లాక్ ఫంగస్ బారినపడిన పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో సోమవారం ఒక్కరోజే 25 మంది బ్లాక్ ఫంగస్ బారినపడిన పేషెంట్లు అడ్మిట్ అయ్యారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గాంధీలో శస్త్ర చికిత్స విభాగం ఏర్పాటు
బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఇప్పటికే కోఠి ఈఎన్టీ ఆస్పత్రిని తెలంగాణ ప్రభుత్వం నోడల్ కేంద్రంగా మార్చింది. తాజాగా గాంధీ ఆస్పత్రిలోని ఈఎన్టీ విభాగం కూడా బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు శస్త్ర చికిత్స అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆస్పత్రిలోని 7వ అంతస్తులో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఇక్కడే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ను మరో రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్లాక్ ఫంగస్ బారినపడి సర్జరీ అవసరమైనవారికి ఇక్కడ వాటిని నిర్వహించనున్నారు.
బ్లాక్ ఫంగస్ లేదా మ్యుకోర్మైకోసిస్ అంటే...
సాధారణంగా బ్లాక్ ఫంగస్ అనేది కుళ్లిపోయిన కూరగాయలు,బ్రెడ్ ముక్కలపై పేరుకుపోయి ఉంటుంది. అలాగే వాతావరణంలోనూ కలిసిపోయి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో గాలి ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి శరీరంలోకి ఇది సులువుగా ప్రవేశించగలదు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు ఉపయోగిస్తుండటం... వాటి ప్రభావంతో పేషెంట్ల రోగ నిరోధక శక్తి తగ్గుతోంది. దీంతో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొంతమంది బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు.
Recommended Video
డయాబెటీస్ ఉన్నవారికి రిస్క్ ఎక్కువ...
డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక చికిత్సల్లో స్టెరాయిడ్స్ వాడటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇలాంటివారు కోవిడ్ బారినపడితే... ఆ చికిత్సలో భాగంగా ఇచ్చే స్టెరాయిడ్స్తో రోగ నిరోధక శక్తి మరింత దిగజారుతుంది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ మృత వైరస్ అవశేషాలు శరీరంలో మిగిలిపోయి ఉంటాయి. బ్లాక్ ఫంగస్ శరీరంలోకి చొరబడేందుకు ఇవి తోడ్పడుతాయి. కాబట్టి కరోనా నుంచి కోలుకున్నవారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత షుగర్ లెవల్స్ పరీక్షించుకుంటూ ఉండాలి. స్టెరాయిడ్స్ అధిక మోతాదులో వాడకూడదు.అలాగే ఆక్సిజన్ థెరపీలో హ్యుమిడిఫయర్లలో సాధారణ నీటిని కాకుండా స్టెరైల్ నీటిని మాత్రమే ఉపయోగించాలి. తద్వారా బ్లాక్ ఫంగస్ బారినపడకుండా ఉండవచ్చు.