లోక్ సభ ఎన్నికల ముందు దెబ్బమీద దెబ్బ..! కాంగ్రెస్ ను గాయపరుస్తున్న గులాబీ ముళ్లు..!!
హైదరాబాద్ : రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే, దేశ రాజకీయాల్లో కీలకంగా మారి, రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చన్న అంచనాలో అదికార గులాబీ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు శాసనసభ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీని మరింత ఆత్మరక్షణలో పడేసి, లోక్సభ ఎన్నికల్లోనూ పైచేయి సాధించాలన్న వ్యూహంలో టీఆర్ఎస్ ఉందని సమాచారం. కాంగ్రెస్ ను మానసికంగా దెబ్బతీసేందుకే ఏఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు ముందే ముగ్గురు ఎమ్మెల్యేలను గులాబీ పార్టీ లాక్కునే ప్రయత్నం చేసిందని టీపీసీసీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదికార పార్టీలో చేరడానికి సిద్ధమేనన్న సంకేతాలు ఇస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఎండి పోయిన మంజీరా, సింగూరు జలాశయాలు..! జంటనగరాల్లో తాగునీటికి కటకట..!!
లోక్సభ వ్యూహమా..? ప్రతిపక్ష హోదాకూ ఎపరా..?
గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు పదును పెంచడంలో లోక్సభ ఎన్నికల వ్యూహం దాగుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముగ్గురు ప్రతిపక్ష ఎమ్మెల్యేల చేరికతోనే టీఆర్ఎస్, మజ్లిస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఖాయమైనా, ఆపరేషన్ ఆకర్ష్ను కొనసాగించడం వెనుక ఈ వ్యూహమే ఉందని చెబుతున్నాయి. కేంద్రంలో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని, కాగా, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ బాట పట్టిన నేపథ్యంలో మరి కొంత మంది జత చేరితే, ప్రధాన ప్రతిపక్ష హోదాకూ ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి జంపింగ్ లు మరింత ఊపందుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
తొలి నుంచి అసంతృప్తితోనే..! అందుకే ఆచితూచి అడుగేసిని సబితమ్మ..!!
ఎన్నికల ఫలితాలు విడుదలైన దగ్గరి నుంచీ సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరనున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఆ వార్తలను సబిత ఖండిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలోనూ తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎలా ఆపాలి? మారేది లేదని ఎలా నమ్మించాలో అర్థం కావట్లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు.
అవమానాలు భరించామంటున్న సబిత..! ఇక సహనం లేదంటున్న మాజీ హోంమంత్రి..!!
వాస్తవానికి గత ఎన్నికల్లో చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి సబిత కుమారుడు కార్తీక్రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్లో చేరడం, చేవెళ్ల నుంచి ఆయన అభ్యర్థిత్వం ఖరారు కావడం వెంటనే జరిగిపోయాయి. శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్ అభ్యర్థిత్వాన్ని కార్తీక్రెడ్డి ఆశించగా.. అదీ దక్కలేదు. దీంతో సబిత, కార్తీక్రెడ్డి తీవ్ర అసంతృప్తితోనే పార్టీలో కొనసాగుతున్నారు.
టీఆర్ఎస్ లో సబిత కుమారుడికి కీలక పదవి..! పార్టీలో చేరడం లాంఛనమే..!!
రాహుల్ సభకు కూడా తనకు సరైన సమాచారం ఇవ్వలేదని, సభ ప్రారంభానికి కొద్దిగంటల ముందు పది పాస్లు పంపుతున్నట్లు సమాచారం ఇచ్చారని సబితారెడ్డి కొందరు పార్టీ నేతల ముందు వాపోయినట్లు తెలిసింది. రాహుల్ సభకు హాజరైనప్పటికీ ఆమె ముభావంగానే కనిపించారు. సభలో ప్రసంగించిన రాహుల్తో పాటు ఇతర నేతలంతా సీఎం కేసీఆర్పై విమర్శలు చేసినప్పటికీ ఆమె పల్లెత్తు మాట అనలేదు. సభ ఆద్యాంతం అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. మరుసటి రోజే, కేటీఆర్తో సబిత సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఆమె పార్టీ వీడడం దాదాపు లాంఛనమే అనే చర్చ జరుగుతోంది.