గోదావరిలో పడవ బోల్తా: తప్పిన పెనుప్రమాదం, బాలుడి గల్లంతు
కరీంనగర్: జిల్లాలోని మహదేవపూర్ మండలం మెట్పల్లి వద్ద నిర్మిస్తున్న అంతరాష్ట్ర గోదావరి వంతెన నిర్మాణం వద్ద ఓ పడవ ఆదివారం సాయంత్రం మునిగింది. ఈ ఘటనలో 12ఏళ్ల బాలుడి గల్లంతయ్యాడు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు గోదావరి తీరం దాటేందుకు అవతలి తీరం మహారాష్ట్రలోని సిరొంచ నుంచి 24మంది ప్రయాణికులతో ఓ పడవ బయలుదేరింది.
మెట్పల్లిలోని గోదావరి తీరానికి పడవ చేరుకునే సమయంలో వంతెన నిర్మాణానికి సంబంధించిన ఇనుప తీగ అడ్డుతగలడంతో బోల్తాపడింది. ప్రమాదానికి కారణాల్లో ఇనుప తీగ ఒకటికాగా, పడవలో ప్రయాణికులకు చెందిన నాలుగు ద్విచక్రవాహనాల వల్ల పడవ బరువు పెరగడం మరో కారణంగా తెలుస్తోంది.

ప్రమాదంలో పడవలో ఉన్న 24మంది నీటమునిగారు. వీరిలో కొంతమంది ఈత కొడతూ ఒడ్డుకు చేరుకోగా, మరికొంతమందిని వంతెన నిర్మాణ సిబ్బంది రక్షించారు. కాగా, కాటారం మండలం ఆదివారంపేటకు చెందిన బుర్ర వంశీ(12) గల్లంతైనట్లు గుర్తించారు. అతనితోపాటు తల్లి, సోదరి(నాలుగు నెలలు) వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పసిపాప పరిస్థితి విషమంగా ఉండటంతో గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో, రెస్క్యూటీంతో గాలింపుచర్యలు చేపట్టారు. ఘటనాస్థలిని ఇరు రాష్ట్రాల పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. కేసు నమోదు చేసి ద్వర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications