బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య: ట్విస్టిచ్చిన నల్గొండ టూటౌన్ సీఐ, కాంగ్రెస్ సభ
నల్గొండ: నల్గొండ మున్సిపల్ ఛైర్పర్సన్ లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. నల్గొండ టూటౌన్ సీఐ రివాల్వర్ను, సిమ్కార్డును ఇచ్చి కొన్ని గంటలు అదృశ్యం కావడం కలకలం రేపింది. మరోవైపు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను నిరసిస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 4వ తేదీన నల్గొండలో సభ నిర్వహించనున్నారు.ఈ కేసులో నిందితులు కూడా బెయిల్పై విడుదలయ్యారు.
నల్గొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసు విషయమై కాంగ్రెస్, టిఆర్ఎస్ ల మద్య విమర్శలు, ప్రత్యారోపణలకు మద్య తెరతీసింది.కిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రమేయంతోనే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిందని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలను ఎమ్మెల్కే వీరేశం ఖండించారు.
Recommended Video
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నల్గొండ డిఎస్పీ సుధాకర్పై ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి ఆరోపణలు చేశారు. పోలీసులు కేసును తప్పుదోవపట్టిస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. పోలీసులపై నమ్మకం లేకనే సిబిఐ విచారణకు ఆదేశించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
కొన్ని గంటలపాటు అదృశ్యమైన టూటౌన్ సీఐ
నల్గొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం నాడు కొన్ని గంటల పాటు అదృశ్యమయ్యారు. పోలీసు శాఖ ఇచ్చిన సిమ్ కార్డును, సర్వీస్ రివాల్వర్ను మాడ్గులపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ అందజేశారు. తన వ్యక్తిగత మొబైల్ ఫోన్ను కూడ వెంకటేశ్వర్లు స్విచ్చాఫ్ చేశారు. ఈ ఘటన నల్గొండలో కలకలం రేపింది. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు ఘటన కారణంగానే వస్తున్న ఒత్తిళ్ళు భరించలేక సిఐ అదృశ్యమైనట్టు ప్రచారం సాగుతోంది.
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య చుట్టూ నల్గొండ రాజకీయాలు
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు చుట్టూనే నల్గొండ రాజకీయాలు సాగుతున్నాయి. శ్రీనివాస్ హత్య కేసులో టిఆర్ఎస్ నేతల హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. నకిరేకల్ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఈ ఆరోపణలను ఎమ్మెల్యే వీరేశం ఖండించారు. చిన్న వివాదం కారణంగా జరిగిన గొడవలోనే శ్రీనివాస్ హత్యకు గురయ్యాడని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రకటించారు. ఎస్పీ ప్రకటనను ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఖండించారు. హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబసభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.
ఫిబ్రవరి4న, నల్గొండలో సభ
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు నిరసనగా నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4వ, తేదిన సభను నిర్వహిస్తోంది. శ్రీనివాస్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తుపై కాంగ్రెస్ నేతలు సంతృప్తిగా లేరు. దీంతో సిబిఐ విచారణను కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో క్యాడర్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకుగాను కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇతర పార్టీల నుండి టిఆర్ఎస్లో చేరాలని ఒత్తిడులు ఎక్కువతున్న విషయాన్ని కూడ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. టిఆర్ఎస్లో శ్రీనివాస్ చేరనందు వల్లే ఆయనను హత్యచేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడ ఇదే రకమైన బెదిరింపులు వచ్చాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరో వైపు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడ తనకు బెదిరింపులు వచ్చాయని చెప్పారు.
శ్రీనివాస్ కేసులో నిందితులకు బెయిల్
నల్గొండ మున్సిఫల్ చైర్ పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులకు శుక్రవారం నాడు బెయిల్ మంజూరైంది.ఈ హత్య కేసులో మెరుగు గోపి, దామలూరి సతీష్, మండ్ర మహేష్, మిట్టపల్లి సాయి, మాతంగి మోహన్, ప్రసాద్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జిల్లా మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ భర్త శ్రీనివాస్ను గతనెల 24 అర్థరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.నల్గొండ పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు కాంగ్రెస్ నేతలకు బెదిరింపులు వస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ కు గన్ మెన్ కల్పించాలని చేసిన వినతిని కూడ పట్టించుకోలేదన్నారు.