పెద్ద కుట్ర, రాజకీయ హత్యే: బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య లక్ష్మి
నల్గొండ: నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రధాన అనుచరుడు.
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో 11 మందిని నిందితులుగా పోలీసులు నిర్దారించి కేసులు నమోదు చేశారు. రాజకీయ కోణంలో హత్య జరగలేదని ఎస్పీ తేల్చేశారు. బజ్జీల బండి వివాదమే హత్యకు కారణమని అన్నారు.
రాజకీయ కోణంలోనే హత్య
రాజకీయ కోణంలోనే తన భర్త హత్య జరిగిందని బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి ఆరోపించారు. తన భర్త హత్యపై సిబిఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. హత్య వెనుక పెద్ద కుట్ర ఉందని ఆమె అన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు.
Recommended Video
మాపై వీరేశం ఒత్తిడి తెచ్చారు
తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, భద్రత కల్పించాలని ఎన్నో సార్లు పోలీసు ఉన్నతాధికారులను కోరామని, అయినా పోలీసులు పట్టించుకోలేదని లక్ష్మి అన్నారు. ఫోన్ చేసి పిలిపించి హత్య చేశారని ఆరోపించారు. తన భర్త హత్య వెనుక నకిరేకల్ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆమె ఆరోపించారు. పార్టీ మారాలని ఎమ్మెల్యే వీరేశం తమపై ఒత్తిడి తెచ్చారని లక్ష్మి చెప్పారు. పక్కా పథకం ప్రకారమే తన భర్తను హత్య చేశారని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.
పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారని
తన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ను పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. పోలీసులు కేసు చేధించిన తర్వాత కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నిందితుల కాల్ లిస్ట్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ గొడవ వల్ల కాదు
మిర్చిబండి దగ్గర గొడవ జరగలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. నకిరేకల్ ఎమ్మెల్యే, డీఎస్పీ కలిసి ఒక్క పథకం ప్రకారమే హత్య చేశారని ఆయన అన్నారు. శ్రీనివాస్ హత్యపై ఎస్పీ విచారణ జరపలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ప్రెస్నోట్ను ఎస్పీ మీడియాకు చదివి వినిపించారని ఆయన ఆరోపించారు.
నిందితులు హైదరాబాద్ వెళ్లలేదు
ఎస్పీ చెప్పినట్లుగా నిందితులు హైదరాబాద్ వెళ్లలేదనీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాల్ లిస్ట్ బయటపెట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ హత్యపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయస్తామని ఆయన ఆయన చెప్పారు.