షకీల్ కుమారుడి హిట్ అండ్ రన్ కేసు: బోధన్ సీఐతోపాటు మరో వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ సహా షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను బోధన్లో ఆదివారం అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు.
ప్రస్తుతం వారిద్దరినీ మాసబ్ ట్యాంక్లోని డీసీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు. గత డిసెంబర్ 23 తేదీన తెల్లవారుజాము 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజాభవన్ దగ్గర ఉన్న బారీకేడ్లపైకి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే కారు దగ్గరకి చేరుకుని వాహనంలో ఉన్న సాహిల్ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి సాహిల్ తప్పించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సాహిల్ స్థానంలో తన కారు డ్రైవర్ను పంపించాడు. దీంతో ఇన్స్పెక్టర్ దుర్గారావు సాయంతో షకీల్ అనుచరులు సాహిల్ను దుబాయ్ పారిపోయేందుకు సహకరించారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన రోజు బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ పంజాగుట్ట సీఐ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు దుబాయ్ పారిపోయేందుకు అబ్దుల్ వాసే సహకరించినట్లు తేల్చారు.
ఆ తర్వాత సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు, సీఐల ఇద్దరి కాల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీసులు దర్యాప్తు చేసి ప్రేమ్ కుమార్ను అరెస్టు చేశారు. కాగా, ఇప్పటి వరకూ ఈ కేసులో షకీల్ డ్రైవర్ సహా అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. తాజాగా, ఈరోజు బోధన్ సీఐ సహా మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications