అపోహలొద్దు: యునానీ ఆస్పత్రిలో బూస్టర్ డోసు ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో తెలంగాణలో బూస్టర్ డోసును ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం ప్రారంభించారు. చార్మినార్ యునానీ ఆస్పత్రిలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి బూస్టర్ డోసు పంపిణీ చేసిన సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. అందరికీ వ్యాక్సిన్ ఉచితమేనని తెలిపారు. 15-18 ఏళ్ల మధ్య వారిలో కేవలం వారం వ్యవధిలో 38 శాతం మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తయిందని మంత్రి వవరించారు.
వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉన్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. యునానీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను చర్చించామని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. నిధుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన మంజూరయ్యేలా చేస్తామన్నారు. ఆస్పత్రిలోని ఖాళీలను పూరించేందుకు రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
రోగులకు వీలైనంత వరకు ఇక్కడే సేవలందించాలని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేయాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం మాస్క్, శానిటైజర్లతో పాటూ వాక్సిన్ తీసుకోవాలన్నారు. వాక్సిన్పై అపోహలు నమ్మొద్దని, అర్హులందరూ వాక్సిన్ తీసుకోవాలని సూచించారు. యునాని ఆస్పత్రి చాలా పాతది అయిపోయిందని, వర్షం పడితే ఇబ్బందిగా ఉందని, యునాని ఆస్పత్రిలోని సమస్యలను మంత్రి హరీష్రావుకు వివరించానన్నారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు. హెల్త్కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ వేస్తున్నారు. గతంలో తీసుకున్నవారికి అదే రిజిస్ట్రషన్ వ్యాక్సిన్ వేస్తున్నారు. రెండో డోసు తీసుకుని 9 నెలల పూర్తయిన వారితోపాటు 60ఏళ్లు దాటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్ డోసు ఇస్తున్నారు. కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ వేయించుకోవాలంటూ వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.