ఓటుకు నోటుపై బొత్స ట్విస్ట్!: 'ఆ రోజు రేవంత్ కారు నడిపింది లోకేష్ డ్రైవరే'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఓ షాకింగ్ కామెంట్ చేశారు. ఓటుకు నోటు కేసు వెలుగు చూసిన రోజున రేవంత్ రెడ్డి కారు నడిపింది టిడిపి యువనేత నారా లోకేష్ డ్రైవరే అని ఆరోపించారు.
కేసుల నుంచి తప్పించుకునేందుకు టిడిపి నేతలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని ఆయన హితవు పలికారు. ఓటుకు నోటు కేసులో టిడిపి నేతలు తప్పులు చేయడమే కాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

రూ.50 లక్షలు ఇస్తూ టిడిపి నేతలు అడ్డంగా దొరికిపోయారన్నారు. ఆ రోజు తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన కారుని నడిపింది ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డ్రైవరేనని షాకింగ్ కామెంట్ చేశారు.
కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ పార్టీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పలు అసత్యాలు పలుకుతున్నారన్నారు. ఎవరు చెవిలో పూలు పెడతారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో నిందితులు ఆ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
'ఓటుకు నోటుపై రాజీ': ఏ1గా.. బాబుపై ఎఫ్ఐఆర్కు ఛాన్స్! ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్లో రాష్ట్రంలో కరవులేదని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. అధికారిక నివేదికల్లో కరవులేదని పేర్కొంటున్నారన్నారు. కరవుపై తప్పుడు ప్రకటనలు చెయ్యొద్దన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలంటూ చంద్రబాబు కాకమ్మ కబుర్లు చెబుతున్నారన్నారు.
హోదాపై రఘువీరా రెడ్డి
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ఏపీ ప్రజలను అవమానపరచడమేనన్నారు.
విభజన చట్టంలో రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తే, బీజేపీ కేవలం రూ.6 వేల కోట్లే విడుదల చేసిందన్నారు. ప్రత్యేక హోదాపై బిజెపి, టిడిపి ఎన్నో కబుర్లు చెబుతున్నాయని, ప్రజలను మోసం చేశాయన్నారు.












Click it and Unblock the Notifications