కిడ్నాప్ కేసు : మాజీ మంత్రి అఖిలప్రియ హైదరాబాద్లో అరెస్ట్...? పోలీస్ స్టేషన్కు తరలింపు...
ప్రముఖ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ,ఆమె భర్త భార్గవ రామ్లను బుధవారం(జనవరి 6) ఉదయం బోయిన్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. మంగళవారం(జనవరి 5) జరిగిన కిడ్నాప్ వ్యవహారంలో పట్టుబడ్డ నిందితుల్లో ఒకరైన చంద్రబోస్ వెల్లడించిన వివరాల మేరకే అఖిలప్రియ,భార్గవ్ రామ్లను పోలీసులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

భూమా నాగిరెడ్డి పక్కకు తప్పుకున్నా...
కిడ్నాప్కు గురైనవారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువులంటూ జరిగిన ప్రచారంతో ఈ కిడ్నాప్ కేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని తేలింది. ప్రధానంగా మూడు కుటుంబాల మధ్య భూ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారమే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి ఉన్న కాలంలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి,మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రవీణ్ రావు కుటుంబం కలిసి హఫీజ్పేట్లో 50 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత భూమా నాగిరెడ్డి,ఏవీ సుబ్బారెడ్డిలు తమ వంతు వాటా కింద డబ్బులు తీసుకుని పక్కకు తప్పుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అక్కడ 20 ఎకరాల భూమి ప్రవీణ్ రావు కుటుంబం పేరిట ఉన్నట్లు తెలుస్తోంది.

పార్ట్నర్స్తో విబేధాలతో...
భూమా అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో ఈ భూ వ్యవహారంపై ప్రవీణ్ రావు కుటుంబాన్ని ఫోన్ ద్వారా ఒకసారి సంప్రదించినట్లు చెప్తున్నారు. అయితే భూమా నాగిరెడ్డి ఐదారేళ్ల క్రితమే తన వాటాను అమ్మేసుకున్నారని... ఆ డబ్బులు కూడా ఇచ్చేశామని ప్రవీణ్ రావు కుటుంబం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ ఎన్నడూ ఆ కుటుంబాన్ని టచ్ చేయని అఖిలప్రియ.. ఇలా ఉన్నట్లుండి వారిని కిడ్నాప్ చేయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటుండటం గమనార్హం. భూమా కుటుంబానికి,వాళ్ల పార్ట్నర్స్కు మధ్య విబేధాలున్నాయని... ఆ విభేదాల్లోకి ఇప్పుడు తమను లాగే ప్రయత్నం చేస్తున్నారని ప్రవీణ్ రావు కుటుంబం ఆరోపిస్తోంది. భూ వివాదంతో తమకెలాంటి సంబంధం లేదని... వారి పార్ట్నర్స్తో తేల్చుకోవాలని అఖిలప్రియకు గతంలోనే చెప్పామని అంటోంది.
Recommended Video

సినీ ఫక్కీలో కిడ్నాప్...
మంగళవారం(జనవరి 4) రాత్రి 7.30గం. సమయంలో ఇన్కమ్ ట్యాక్స్,పోలీస్ డిపార్ట్మెంట్ పేరు చెప్పి మొత్తం 15 మంది వ్యక్తులు బోయిన్పల్లిలోని ప్రవీణ్ రావు ఇంట్లోకి చొరబడ్డారు. ఆయనతో ఆయన సోదరులు సునీల్ రావు,నవీన్ రావులను వేర్వేరు గదుల్లో నిర్బంధించి సెల్ఫోన్లు,ల్యాప్టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బలవంతంగా కారులో ఎక్కించుకుని బయలుదేరారు. కుటుంబ సభ్యులు తమకు పరిచయస్తుడైన మంత్రి శ్రీనివాస్ గౌడ్కు వెంటనే సమాచారం అందించారు. అలాగే బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ గంటల వ్యవధిలోనే కిడ్నాప్ను చేధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కార్ల నంబర్లను గుర్తించి... లంగర్ హౌస్ సమీపంలో నిందితులను పట్టుకున్నారు.

ప్రమేయం ఉన్నట్లు తేలితే అరెస్ట్...
నిందితుల్లో ఒకరైన చంద్రబోస్ అనే వ్యక్తి భూమా అఖిలప్రియ బంధువుగా తెలుస్తోంది. అతని నుంచి రాబట్టిన వివరాల మేరకే అఖిలప్రియ,ఆమె భర్త భార్గవ రామ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో వీరిని విచారిస్తున్న పోలీసులు... ఒకవేళ కిడ్నాప్లో వీరి ప్రమేయం ఉన్నట్లు తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం వీరందరినీ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications