చదువుకున్న మూర్ఖుడు: కంచ ఐలయ్యపై బ్రాహ్మణ సమాఖ్య తీవ్ర వ్యాఖ్య
హైదరాబాద్: చదువుకుంటే సంస్కారం వస్తుందని, విజ్ఞానం వికసిస్తుందని, కానీ కంచ ఐలయ్య చదువుకున్న మూర్ఖుడని ఎపి బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య వ్యాఖ్యానించింది. నిన్న బ్రాహ్మణులపై, అంతకుముందు హిందూమతంపై ఐలయ్య చేసిన పరుష వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని సమాఖ్య అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కోసూరు సతీష్శర్మ, కార్యనిర్వాహక కార్యదర్శి తిప్పావజ్జుల నారాయణ శర్మ విమర్శించారు.
బ్రాహ్మణులు, హిందువులను యదేచ్ఛగా విమర్శలు చేస్తున్న కంచ ఐలయ్య ఇతర కులాలను విమర్శించి చూడాలని సవాల్ చేశారు. అప్పుడే ఆయన సెక్యులర్ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్ముతారని ఓ ప్రకటనలో అన్నారు. తిని కూర్చునే సోమరుపోతులు బ్రాహ్మణులంటూ ఐలయ్య చేసిన వ్యాఖ్యలు ఆయనలోని అనాగరికుడిని చాటుతున్నాయని, బ్రాహ్మణులను నిందించడం ద్వారా తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
బ్రాహ్మణులపై ఆయన చేసిన విమర్శలు మొత్తం సమాజం మీద చేసినట్టేనని స్పష్టం చేశారు. గతంలో జీయర్స్వామిని, హిందు మతాన్ని అవహేళన చేసిన ఐలయ్యనుంచి బ్రాహ్మణులు, హిందువులు నేర్చుకోవలసిన దుస్థితి ఇంకా రాలేదన్నారు. మంత్రాల్లోని అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలే తప్ప, తనకు తెలియకపోతే ప్రపంచానికీ తెలియదన్న అజ్ఞానంతో విమర్శలు చేయటం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు.

లోకకల్యాణం, సమసమాజ నిర్మాణం గురించి పరితపించే బ్రాహ్మణులపై, ఐలయ్య చేసిన విమర్శలకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఐలయ్య వ్యాఖ్యలను కుల మతాలకు అతీతంగా అందరూ ఖండించాలని కోరారు.
కంచ ఐలయ్య బ్రాహ్మణీయ భావజాలాన్ని, హిందూ మతాన్ని వ్యుతిరేకిస్తూ వై యామ్ నాట్ ఎ హిందూ (నేను హిందువునెట్లయిత) అనే పుస్తకం రాశారు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులుగా పనిచేశారు. దళిత మేధావిగా ఆయనకు పేరుంది.












Click it and Unblock the Notifications