ఇంత అవినీతా?, రైతుల ఆత్మహత్యలకు ఇవీ కారణాలే: హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: ప్రభుత్వ అధికారుల్లో అవినీతి పెచ్చుమీరుతోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.పాస్ పుస్తకం కావాలంటే రూ.2 వేలు, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే రూ.4 వేలు చెల్లించాలా? అవినీతికి ఇంత రేటా? పట్టాదారు పాస్ పుస్తకం పొందడం రైతు హక్కు కాదా? ట్రాన్స్ఫార్మర్ వ్యవసాయ అవసరాలకే కదా? మరి అధికారులు ఇలా రేట్లు నిర్ణయించి ఎలా వసూలు చేస్తున్నారు? అంటూ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది.
అంతేగాక, రైతుల ఆత్మహత్యల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు? ఇలా అవినీతికి రేట్లు నిర్ణయించడం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని హైకోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది.
మహబూబ్నగర్ జిల్లాలో రెవెన్యూ, ట్రాన్స్కో, ఖజానా శాఖల్లో అవినీతిపై మీడియాలో వచ్చిన కథనాన్ని ఉమ్మడి హైకోర్టు తనకు తాను (సుమోటో)గా విచారణకు తీసుకుంది. దీనిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వి భట్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతిపై ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని వివరాలు అడిగింది. పాస్పుస్తకం పొందడం రైతు హక్కు అయినపుడు మీ అధికారులు రైతులను కార్యాలయాల చుట్టూ ఎందుకు తిప్పుకొంటున్నారని నిలదీసింది. ఏదైనా వివాదం ఉంటే తప్ప మిగిలిన సమయాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అందించేలా ఉండాలిగానీ ఇలా రేట్లు నిర్ణయించడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించింది.
ట్రాన్స్ఫార్మర్ వ్యవసాయ అవసరాలకే అయినపుడు దాన్ని పొందడం రైతుల హక్కు, రూ.4 వేలు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది. ఇది రైతుల హక్కులను కాలరాయడమేనని పేర్కొంది. రైతుల ఆత్మహత్యల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామని ఓ వైపు ప్రభుత్వం చెబుతోంది, రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న అవినీతి రేట్లే అన్నదాతల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని వ్యాఖ్యానించింది.
రెవెన్యూ శాఖలో ఈ రేట్లను చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది.. రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టడానికి ఓ ప్రత్యేక యంత్రాంగం అవసరమని అభిప్రాయపడింది. ఆన్లైన్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి, రైతు వ్యక్తిగతంగా అధికారి వద్దకు వెళ్లకుండా చూడాల్సి ఉందంది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ స్పందిస్తూ.. ఇప్పటికే మీ సేవ కేంద్రాలున్నాయని చెప్పారు.
గడువిస్తే దీనిపై సమగ్రంగా కౌంటరు దాఖలు చేస్తామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మీసేవ కేంద్రాలు సక్రమంగా పని చేస్తుంటే రైతులు కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తోందని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకారి (అమికస్ క్యూరీ)గా వ్యవహరించాలని సీనియర్ న్యాయవాది ఎస్ సత్యంరెడ్డిని కోరింది. అవినీతి నిరోధానికి సలహాలు, సూచనలతో ఓ విధానం రూపకల్పనకు సహకరించాలని సూచించింది.
దీనికి న్యాయవాది సత్యంరెడ్డి అంగీకరించారు. ప్రస్తుతం చెబుతున్న రేట్లు చాలా తక్కువని.. సాధారణంగా ఎకరా పొలానికి పాస్పుస్తకం పొందాలంటే రూ.2 వేలని, అదే 15 ఎకరాలుంటే మరింత ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోందన్నారు. ట్రాన్స్ఫార్మర్ కావాలంటే రైతులు రూ.50 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తోంద తెలిపారు.
వాదనలు విన్న ధర్మాసనం వాస్తవ పరిస్థితులను పరిశీలించి తగిన సూచనలు చేయాలని అమికస్ క్యూరీని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వ్యవహారానికి సంబంధించి కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
రైతు ఆత్మహత్యలపై మంగళవారం విచారణ
రైతు ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్ పైన మంగళవారం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం... రైతు ఆత్మహత్యలు ఆగిపోవాలని చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే,ఎస్వి భట్లతో కూడి ధర్మాసం విచారణ చేపట్టింది.
రైతుల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోవాలన్నదే తమ ఉద్దేశమని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరపు న్యాయవాదులు... ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను కోర్టుకు వివరించారు.పథకాలు బాగానే ఉన్నాయి కానీ సరిపోవని హైకోర్టు అభిప్రాయపడింది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు మూడు రోజుల్లోనే పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
కాగితాలపై ఉన్న పథకాలు రైతులకు చేరుతున్నాయా అని ప్రశ్నించింది. పథకాల వివరాలు, వాటిని పొందే విధానాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది. కోదండరాం సూచనలు బాగున్నాయని, అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తెలిపింది.
అధికారుల అవినీతి కూడా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతోందని, అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని న్యాయస్థానం సూచించింది. లంచాలు తీసుకుంటే వీడియో తీయాలని ఆదేశించింది. లంచాలనిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications