పెళ్లి ఇష్టం లేదని వరుడు పరారీ: పోలీసులకు ఫిర్యాదు చేసిన వధువు
వివాహం ఇష్టం లేదంటూ వరుడు కల్యాణ ముహూర్తం సమయానికి పారిపోయిన సంఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తానేదార్పల్లి శివారు చంద్రుతండాలో బుధవారం చోటు చేసుకుంది.
వరంగల్: వివాహం ఇష్టం లేదంటూ వరుడు కల్యాణ ముహూర్తం సమయానికి పారిపోయిన సంఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తానేదార్పల్లి శివారు చంద్రుతండాలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ రావుల నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ మండలం గుండ్లసింగారం గ్రామానికి చెందిన లక్ష్మి కుమార్తె సరితకు చంద్రుతండాకు చెందిన మోహన్తో వివాహం చేసేందుకు నిశ్చయించారు.
బుధవారం వేకువజామున 4 గంటలకు వీరి వివాహం జరగాల్సి ఉంది. గుండ్లసింగారంలోని వధువు ఇంటి వద్ద వివాహానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంటి ముందు షామియానా వేసి వంటలు సిద్ధం చేసుకున్నారు. వధువు కుటుంబ సభ్యులు మోహన్ను తీసుకొచ్చేందుకు కారు తీసుకొని చంద్రుతండాకు వెళ్లారు.
ఈ వివాహం ఇష్టం లేని మోహన్.. తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో వధువు తరపు బంధువులు నిర్ఘాంతపోయారు. పెళ్లి చేసుకోకుండా మోసానికి పాల్పడిన మోహన్పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతూ వధువు సరిత స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
వైరా: రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకు మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజీ పినపాక వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తల్లాడ మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన శీలం వెంకటచలపతిరెడ్డి (35) ఇద్దరు కూతుళ్లు హర్షిత (10), సాత్వికా కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలోని కార్తీక్ విద్యాలయంలో చదువుతున్నాడు. వీరికి జ్వరం వచ్చిందని తెలుసుకున్న వెంకటచలపతిరెడ్డి పాఠశాలకు వెళ్లి కూతుళ్లను తీసుకొని ఇంటికి బయల్దేరాడు.
ఈ క్రమంలో స్టేజీ పినపాక వద్ద ఎదురుగా వస్తున్న కారు వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటచలపతి రెడ్డితోపాటు హర్షిత అక్కడికక్కడే మృతి చెందగా, మరో కూతురు సాత్వికా తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు సాత్వికాను చికిత్స కోసం 108 లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని వైరా డిఎస్పి శ్రీధర్రెడ్డి, సిసి మల్లయ్యస్వామి, ఎస్ఐ ఆంజనేయులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భార్య మృతితో భర్త కన్నుమూత
ధర్మసాగర్: భార్య మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తన జీవిత భాగస్వామి ఇక లేదన్న బాధతో భర్త ఆమె సమాధి వద్ద కుప్పకూలిపోయి మరణించిన సంఘటన ధర్మసాగర్ మండలం శాయిపేటలో బుధవారం చోటు చేసుకుంది. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచి వక్కల మల్లమ్మ, వక్కల నర్సయ్య దంపతులు. వారి కాపురంలో ఎటువంటి గొడవలకు తావు లేకుండా అన్యోన్యంగా జీవించారు.
మల్లమ్మ (75) మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు కర్మక్రియల్లో భాగంగా బుధవారం మల్లమ్మ సమాధి వద్ద నర్సయ్య (80) పాలు పోశాడు. భార్య సమాధిని చూసి ఆవేదన చెందుతూ అక్కడే కుప్ప కూలిపోయాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే రాజయ్య బుధవారం నర్సయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications