ఢిల్లీ వీధుల్లో గర్జిస్తున్న KCR!!
దేశ రాజధాని ఢిల్లీ వేదికపై భారతీయ రాష్ట్ర సమితి గళం వినిపించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. కుటుంబ సమేతంగా ఈరోజు హస్తినాపురం బయలుదేరనున్న ఆయన రెండురోజులపాటు అక్కడే ఉంటారు. రాష్ట్రాల పర్యటనతోపాటు జాతీయ రాజకీయాల్లో అనుసరించాల్సి విధానంపై నేతలతో చర్చించనున్నారు. అలాగే మంగళ, బుధవారాల్లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయంలో 'రాజశ్యామల' యాగం చేయనున్నారు. కేసీఆర్ తోపాటు పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.
కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ వీధుల్లో భారతీయ రాష్ట్ర సమితి ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. అరవింద్ అలిశెట్టి పేరుతో హస్తిన వీధుల్లో ఈ ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. 'దేశ్ కీ నేత.. కిసాన్ భరోసా.. కేసీఆర్ ఫర్ ఇండియా.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అనే నినాదాలను ఫ్లెక్సీలో రాశారు. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు కేసీఆర్ ప్రకటించగానే ఏపీ, కర్ణాటకలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచించారు.

త్వరలోనే విజయవాడకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం ఇక్కడి కార్యాలయ పనుల పర్యవేక్షణ బాధ్యత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూస్తున్నారు. విజయవాడకు సమీపంలోని జక్కంపూడిలో 800 గజాల్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలతోపాటు ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండే లోక్ సభ నియోజకవర్గాలను గుర్తించి వాటిల్లో కూడా పోటీచేయాలని నిర్ణయించారు. వీటన్నింటిపై కేసీఆర్ త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications