బీఆర్ఎస్ మీటింగ్ కు మల్లారెడ్డి, అల్లుడు డుమ్మా; ఎర్రవెల్లి ఫాంహౌస్ కు నేతలు!!
తెలంగాణ భవన్ లో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన ఈ సమావేశానికి మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్సీ కవితతో పాటు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పైన వీరంతా సమాలోచనలు చేశారు.
అయితే బి ఆర్ ఎస్ పార్టీ సమావేశానికి మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాకుండా డుమ్మా కొట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించిన మంత్రి కేటీఆర్, అనంతరం పార్టీ నేతలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లారు.

ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ వద్దకు వెళ్లిన వారంతా కేసీఆర్ తో భేటీ కానున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కెసిఆర్ తో వారు చర్చించనున్నారు. ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంటే మరోపక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కెసిఆర్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో పరాజయం పాలైన బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాలలో పోటీ చేసి 39 స్థానాలలో మాత్రమే గెలిచింది. ఇక కామారెడ్డిలో కెసిఆర్ ఘోర ఓటమి పాలయ్యారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మూడో స్థానానికి పరిమితం కావడం, ఘోరంగా ఓడిపోవడం పార్టీ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు.
ఆరుగురు మంత్రులు సైతం ఓటమి పాలు కావడం కెసిఆర్ కు జీర్ణించుకోలేని విషయం. అభివృద్ధి చేసినప్పటికీ చాలా చోట్ల అభ్యర్థులు ఓడిపోయిన దానిపై కెసిఆర్ తో భేటీలో ప్రస్తుతం నేతలు చర్చించనున్నారు. భవిష్యత్ లో ఏం చెయ్యాలి .. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న దానిపై చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications