రేవంత్ రెడ్డి షాక్ తప్పేలా లేదు.. మారుతున్న ఈక్వేషన్లు: బీఆర్ఎస్ హ్యాపీ
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. ఇవి- అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న కాంగ్రెస్ పార్టీకి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులను సృష్టించడానికి దారి తీసే అవకాశాలు లేకపోలేదు. భారీగా వలసలను ప్రోత్సహించడం బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది.
ప్రతపక్ష భారత్ రాష్ట్ర సమితిని ఖాళీ చేయడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేల రెడ్ కార్పెట్ వేసింది. కండువా కప్పింది. 10 మంది ఎమ్మెల్యేలు, అదే స్థాయిలో శాసన మండలి సభ్యులు గులాబీ పార్టీకి గుడ్బై చెప్పారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నారు.

కడియం శ్రీహరి- స్టేషన్ ఘన్పూర్, దానం నాగేందర్- ఖైరతాబాద్, తెల్లం వెంకట్రావ్- భద్రాచలం, పోచారం శ్రీనివాసరెడ్డి- బాన్సువాడ, డాక్టర్ ఎం సంజయ్ కుమార్- జగిత్యాల, కాలె యాదయ్య- చేవెళ్ల, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి- గద్వాల, టీ ప్రకాష్ గౌడ్- రాజేంద్రనగర్, అరికెపూడి గాంధీ- శేరిలింగంపల్లి, గూడెం మహిపాల్ రెడ్డి- పఠాన్చెరు.. కాంగ్రెస్లోకి వలస వెళ్లిన విషయం తెలిసిందే.
అధికారంలోకి వచ్చి ఏడాది కూడా గడవకముందే పెద్ద ఎత్తున వలసల ఆపరేషన్ను చేపట్టడం విమర్శలకు దారి తీసినప్పటికీ.. పెద్దగా పట్టించుకోలేదు. పార్టీ ఫిరాయించిన సభ్యులపై అనర్హత ఓటు వేయాలంటూ శాసనమండలి ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్కూ వినతిపత్రాలను అందజేశారు.
ఇదిలా కొనసాగుతుండగానే- రివర్స్ వలసలు మొదలయ్యాయి. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు యూటర్న్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అధికార పార్టీ వాతావరణానికి ఇమడలేక పోతున్నారని తెలుస్తోంది. ఎక్కువ కాలం పాటు అందులో కొనసాగలేమనే కారణంతో పీఛేముడ్ అవుతున్నారని చెబుతున్నారు.
ఈ క్రమంలో గద్వాల్ ఎమ్మెల్యే బీ కృష్ణమోహన్ రెడ్డి.. ఇదివరకే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధికారి, మాజీ మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు కూడా. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన కేటీఆర్ను ఆయన ఛాంబర్లో కలిశారు. పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు వివరించారని సమాచారం.
ఇదే బాటలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, డాక్టర్ సంజయ్ కుమార్ కూడా సొంతగూటికి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అనుసరిస్తోన్న విధానాలు మింగుడు పడట్లేదని, బయట నుంచి కనిపిస్తోన్నంతగా లోపలి వాతావరణం ఉండట్లేదని వారు చెబుతున్నట్లు తెలుస్తోంది.
తెల్లం వెంకట్రావ్ మళ్లీ బీఆర్ఎస్కు వెళ్తారనే ప్రచారాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోసిపుచ్చారు. ఆయనతో తనకు పాత పరిచయం ఉందని, తమతోనే కలిసి ఉంటాడని చెప్పారు. ఆయన ఎక్కడికీ పోడని స్పష్టం చేశారు. తమ పార్టీ కండువా కప్పుకొన్న వారికి ఇబ్బంది కలగదని పొంగులేటి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications