కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత: కవిత సంచలన విమర్శలు, రాహుల్కు ప్రశ్నలు
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కుట్ర అని.. ప్రజలను మభ్యపెట్టడంలో ఆ పార్టీ ముందుంటుందని కవిత విమర్శించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత సోమవారం తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలని డీఎంకే నేత హేళన చేసినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
ఇండియా కూటమిలో డీఎంకే కూడా ఉందని గుర్తుచేసిన కవిత.. కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై మౌనం వహించడాన్ని ప్రశ్నించారు. దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర చేశానని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ.. తమ మిత్రపక్షం నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పట్టనట్టు ఉంటున్నారని కవిత విమర్శించారు.
కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని రాహుల్ గాంధీ వెల్లడించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత దోరణి ఉందని ధ్వజమెత్తారు కవిత. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డీఎంకే నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎందుకు అదుపు చేయడం లేదని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరి ఏంటో రాహుల్ గాంధీ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడమని విమర్శించారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏవేవో హామీలు ఇస్తుందని.. కానీ ఎన్నికల తర్వాత వాటిని విస్మరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై కవిత స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇస్తామని చెప్పారు. ఆలోగా అమలు చేయకపోతే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంతో పోరాడుతామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.












Click it and Unblock the Notifications