ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
తెలంగాణ సీఎం, టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు శుక్రవారం సమావేశమయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డితో కలిసి కేకే సీఎం రేవంత్ వద్దకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్లు కేకే గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మద్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఈ భేటీలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, పలువురు నేతలు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు తెలిసింది. తన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కేకే అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

కేకే ఘర్ వాపసీ
తెలంగాణ గురించి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కంటే ముందే కాంగ్రెస్ ఆలోచించిందని ఎంపీ కె కేశవరావు తెలిపారు. బాగారెడ్డి ఛైర్మన్గా కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ ఏర్పాటు జరిగిందన్న కేకే.. రాజీనామా చేస్తామని 42 మంది ఎమ్మెల్యేలు సోనియాకు లేఖ రాశారని గుర్తు చేశారు. 1998 నుంచి తెలంగాణ గురించి పోరాటం మొదలైందన్నారు. తెలంగాణ కోసం చాలా మంది నాయకులు నిరాహార దీక్షలు చేశారని కేకే గుర్తు చేశారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ను కుటుంబమే నడిపిస్తుందనే భావన ప్రజల్లో ఉందని కేకే చెప్పారు. ఏం చేసినా కేడర్ను దూరం చేసుకోకూడదని సూచించారు. భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ ఇచ్చిన గౌరవం మరిచిపోలేనన్నారు కేకే. అయితే, కొన్ని సరి చేసుకోవాల్సినవి బీఆర్ఎస్ సరి చేసుకోలేదని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా తాను ఘర్ వాపస్ కావాలని నిర్ణయించుకున్నట్లు కేశవరావు తెలిపారు.
కాగా, ఇటీవల కేశవరావు ఇంటికి వెళ్లిన దీపాదాస్ మున్షీ.. కేకేతోపాటు ఆయన కుమార్తె విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయలక్ష్మితోపాటు కేకే కూడా తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే, తన కుమారుడు విప్లవ్ మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనకు కేసీఆర్ అంటే గౌరవం ఉందని.. తనకు వారు గౌరవం ఇచ్చారని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications