తెలంగాణ అడిగిందేంటి? కేంద్రం ఇచ్చిందేంటి?: లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందన్నారు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని 9 ఏళ్లుగా కోరుతున్నామన్నారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ఎన్నోసార్లు అడిగామని.. కోచ్ ఫ్యాక్టరీలను గుజరాత్, మహారాష్ట్రకు ఇచ్చి.. తమకు రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చారన్నారు.
తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలని అడిగామన్నారు. నవోదయ విద్యాలయాల కోసం ఎన్నోసార్లు లేఖలు రాశామన్నారు. అయినా నవోదయ, మెడికల్ కాలేజీలు ఇవ్వట్లేదన్నారు. తెలంగాణ పట్ల మోడీ సర్కారు వివక్ష చూపుతోందని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. చిన్న రాష్ట్రాల మీద కేంద్రం తీరు సరిగా లేదన్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కూడా దేశంలో భాగమే కదా అని అప్రశ్నించారు.

యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఆర్ ప్రాజెక్టును మోడీ సర్కార్ రద్దు చేసిందని మండిపడ్డారు. తెలంగాణ పథకాలను కేంద్రం అనుసరిస్తోందన్నారు నామా. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఇతర రాష్ట్రాల్లో ఇంటింటికి మంచినీరు వస్తోందా..? హర్ ఘర్ జల్ పథకం కింద అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారు.
మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదని ఎంపీ నామా అన్నారు. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ధాన్యం దిగుబడిలో పంజాబ్ను తెలంగాణ అధిగమించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం విపరీతంగా పెంచింది.
మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ఈ ఘటనలతో విదేశాల్లోనూ భారత్ పరువు మంటగలిసింది. ప్రధాని మోడీ మణిపూర్కు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు. మణిపూర్లో శాంతిని పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.












Click it and Unblock the Notifications