బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా..
BRS: భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్రను రీ నామినేట్ చేసింది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ నాటికి ఆయన పదవీ కాలం ముగియనుంది. రెండోసారి కూడా ఆయనకే అవకాశం ఇచ్చారు.
ప్రస్తుతం రాజ్యసభలో ఏడుమంది సభ్యుల బలం ఉంది బీఆర్ఎస్కు. బీ పార్థసారథి రెడ్డి, డీ దామోదర్ రెడ్డి, కే కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బీ లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్.. రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వారిలో వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్ పదవీ కాలం ఏప్రిల్ నాటికి ముగియబోతోంది.

శాసనసభలో బీఆర్ఎస్కు ఉన్న బలం ఆధారంగా ఈ దఫాలో ఒక్కరిని మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉంది. దీనితో వద్దిరాజును రీనామినేట్ అయ్యారు. గురువారం ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. మిగిలిన వారిలో పార్థసారథి రెడ్డి, దామోదర్ రెడ్డి పదవీ కాలం 2028లో ముగుస్తుంది. 2026 ఏప్రిల్ వరకూ కే కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతారు.
వద్దిరాజు రవిచంద్రకు గాయత్రి రవిగా గుర్తింపు ఉంది. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు ఆయనే. ప్రస్తుతం చీఫ్ ప్రమోటర్గా వ్యవహరిస్తోన్నారు. తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుగా ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వద్దిరాజు గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశారు.
2018 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. 2022లో మొదటి సారిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇప్పుడు ఆయననే మళ్లీ రీ నామినేట్ చేశారు కేసీఆర్.












Click it and Unblock the Notifications