పొంగులేటితో భేటీ: ముఖ్య నేతలతోపాటు 20 మందిపై బీఆర్ఎస్ వేటు
వైరా నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఈ విషయం బీఆర్ఎస్ అధిష్టానానికి తెలియడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
ఖమ్మం: బీఆర్ఎస్ పార్టీకి దూరమైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీపై నేరుగా విమర్శలు చేస్తున్న పొంగులేటి.. వరుస ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో పొంగులేటిని కలిసిన బీఆర్ఎస్ నేతలపై ఆ పార్టీ కఠిన చర్యలకు ఉపక్రమించింది.
తాజాగా, వైరా నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పొంగులేటిని కలిశారు. ఈ విషయం బీఆర్ఎస్ అధిష్టానానికి తెలియడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. వైరా నియోజకవర్గంలో 20 మంది నాయకులపై బీఆర్ఎస్ అధిష్టానం బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది.
రాష్ట్ర మార్క్ఫెడ్ ఫెడ్ వైఎస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ ను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించింది. అంతేగాక, వైరా పురపాలక ఛైర్మన్ జైపాల్ తోపాటు మరో 18 మందిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసింది. గత కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కేసీఆర్పై విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో అధిష్టానం సీరియస్గా స్పందిస్తోంది.
ఆదివారం ఉదయం దాదాపు ఐదు మండలాలకు చెందిన నేతలు పొంగులేటితో సమావేశమయ్యారు. పలువురు ముఖ్య నేతలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పొంగులేటితో భేటీ అయిన నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షలు ప్రకటించారు. కాగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన షర్మిల పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తనవెంట కలిసివచ్చేవారితో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతున్నారు. కాగా, ఇవాళ సీపీఐ పార్టీకి చెందిన కొందరు పొంగులేటి వర్గంలో చేరారు.