బీఆర్ఎస్ వరంగల్ తూర్పు టికెట్ రూ.100కోట్లు.. నామినేషన్ వేసిన రెబల్ అభ్యర్థి సంచలనం!!
వరంగల్ తూర్పు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వరంగల్ తూర్పులో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, బిజెపి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ఒకపక్క ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ కొనసాగుతూ ఉంటే, అధికార పార్టీ ఎమ్మెల్యేకు మాత్రం రెబల్స్ తో తలపోటు తప్పడం లేదు.
తాజాగా బీఆర్ఎస్ నాయకుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పార్టీ పేరుతో హంగామా చేసే నాయకుడు రాజనాల శ్రీహరి తొలిరోజు నామినేషన్ ను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగాను, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగాను రెండుసెట్ల నామినేషన్లు దాఖలు చేసిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ టికెట్ ను 100కోట్లకు నన్నపనేని నరేందర్ కొనుగోలు చేశాడని, ఇక ఆ విషయం ఎమ్మెల్యే నరేందర్ తానే స్వయంగా చెప్పాడని పేర్కొన్నారు.

తాను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడైన నాయకుడిని అని, తనకు నలుగురు గన్మెన్లు ఉండే వాళ్ళని, లైసెన్స్డ్ వెపన్ కూడా ఉండేదని, నన్నపనేని నరేందర్ అప్పట్లో ఏం చేసేవాడు అనేది ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలో నన్నపనేని నరేందర్ ను ఓడించి తీరుతానని రాజనాల శ్రీహరి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మీడియాకు వెల్లడించారు.
కేటీఆర్ రాజకీయాలు చేయకముందే తాను రాజకీయాలు చేశానని పేర్కొన్న రాజనాల శ్రీహరి వరంగల్ తూర్పు ప్రజలు నరేందర్ ని తన్ని తరిమేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇవ్వాలంటే ఏం చేయాలో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇవ్వాలంటే రౌడీలు కావాలా, రౌడీ షీటర్లు అయ్యుండాలా, మర్డర్లు, మానభంగాలు చేసిన చరిత్ర ఉండాలా అంటూ ప్రశ్నించారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గం లో ఎలాగైనా నన్నపనేని నరేందర్ ను ఓడించి తీరుతానని రాజనాల శ్రీహరి వ్యాఖ్యలు చేయడంతో స్థానికంగా చర్చ జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది












Click it and Unblock the Notifications