బడ్జెట్ సమావేశాలు 10రోజులు నిర్వహించాలి..! అసెంబ్లీలో కాంగ్రెస్ డిమాండ్..!!
హైదరాబాద్: తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా సాగనున్నాయి. ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రజాసమస్యల పరిష్కరం దిశగా సమావేశాలు ముందుకెళ్తే శ్రేయస్కరంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అంతే కాకుండా తెలంగాణ ప్రజలకు అదికార గులాబీ పార్టీ ఇచ్చిన హామీల అమలు పట్ల కూడా శాసన సభలో చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. సంక్షేమ పథకాలు పెద్దయెత్తున అమలు చేస్తున్నామని చెప్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పథకాల పట్ల సమగ్ర చర్చ జరిపితే క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుస్తుందని కాంగ్రెస్ అంటోంది. అంతే కాకుండా అసెంబ్లీ సమావేశాలను కనీసం పది రోజులైనా నిర్వహించాలని సీఎల్పీ కోరింది.
సీఎల్పీ నేత మల్లు భట్టితో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కలిశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎర్రజొన్న గిట్టుబాటు ధర కల్పనపై చర్చకు అవకాశం కల్పించాలని కోరారు. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎల్పీ సమావేశంలో పుల్వామా అమరజవానులకు నివాళులర్పించి రెండు నిముషాలు మౌనం పాటించారు.
ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పీ. సబితా ఇంద్రారెడ్డి, డీ. శ్రీధర్ బాబు, సీతక్క, హరిప్రియ నాయక్, హర్షవర్ధన్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, చిరుమర్తి లింగయ్య, డీ. సుధీర్ రెడ్డి, పోడెం వీరయ్య, జాజుల సురేందర్, వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ హాజరయ్యారు.