Bullet Bandi Sai Shriya : 'బుల్లెట్ బండి' ఫేమ్ నవ వధువు సాయి శ్రీయకు బంపరాఫర్...
'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని..' ఇటీవలి కాలంలో ఈ పాట జనాలను ఓ ఊపు ఊపుతోంది. ఎక్కడ విన్నా ఇదే పాట మారుమోగుతోంది. సాయి శ్రీయ అనే వధువు పెళ్లి బరాత్లో చేసిన డ్యాన్స్తో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. ఒరిజినల్ సాంగ్లో కొరియోగ్రఫీ కన్నా... పెళ్లి బరాత్లో వధువు చేసిన డ్యాన్సే ఆ పాటకు పర్ఫెక్ట్ అనే ఫీల్ కలిగించింది. సాయి శ్రీయ తన డ్యాన్స్కు చాలామంది ఫిదా అయిపోయారు. సామాన్యులు మొదలు పలువురు ప్రముఖులు సైతం సాయి శ్రీయ డ్యాన్స్ను సోషల్ మీడియాలో కొనియాడారు. అనూహ్యంగా ఇంత క్రేజ్ సంపాదించుకున్న సాయి శ్రీయకు తాజాగా మరో ఆఫర్ వరించింది.
'బుల్లెట్ బండి' ఒరిజినల్ పాటను నిర్మించిన బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సాయి శ్రీయకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ తదుపరి పాటలో నటించాలని ఆ సంస్థ అధినేత నిరూప సాయి శ్రీయను కోరింది. ఈ మేరకు ఆమె ఫోన్లో సాయిశ్రీయతో మాట్లాడినట్లు సమాచారం. అనుకోని ఈ ఆఫర్కు సాయి శ్రీయ కూడా ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సాయి శ్రీయ నుంచి మరో అద్భుతమైన పెర్ఫామెన్స్ చూడవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మంచిర్యాల జిల్లా జన్నారంకు చెందిన అటవీ శాఖ ఉద్యోగి రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయ వివాహం ఈ నెల 14న జరిగింది.మంచిర్యాల జిల్లాకే చెందిన రామకృష్ణాపూర్ వాసి అశోక్తో ఆమె వివాహం జరిగింది. వివాహానంతరం నిర్వహించిన బరాత్ వేడుకలో సాయి శ్రీయ తన డ్యాన్స్తో భర్తను సర్ప్రైజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కొన్ని గంటల్లోనే వైరల్గా మారింది. మీడియా చానెళ్లు సైతం సాయి శ్రీయ ఇంటికి క్యూ కట్టాయి. ఊహించని ఈ స్పందన పట్ల సాయి శ్రీయ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.

పెళ్లి జరిగిన మరుసటిరోజు ఆ కొత్త జంట వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని దర్శించుకోగా... అక్కడ కొంతమంది వారికి సన్మానం కూడా చేశారు. ఈ సందర్భంగా సాయి శ్రీయ మాట్లాడుతూ... తన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుందని అసలు ఊహించలేదన్నారు. మొదట కొంతమంది ఫ్రెండ్స్ వాట్సాప్ ద్వారా షేర్ చేయగా... అక్కడి నుంచి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఆ వీడియో చేరిందన్నారు. తన డ్యాన్స్ పట్ల వస్తుందన స్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
సాయి శ్రీయ తరహాలోనే జ్యోతి అనే ఓ నర్సు కూడా ఇలాగే బుల్లెట్ బండి సాంగ్కి డ్యాన్స్ చేయగా ఆ వీడియో కూడా వైరల్గా మారింది. అయితే విధి నిర్వహణలో ఉండి ఇలా డ్యాన్స్ చేయడమేంటని ఉన్నతాధికారులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు మెమో జారీ చేసి వివరణ కోరారు. అయితే అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజు... విరామ సమయంలో ఆమె డ్యాన్స్ చేసిందని... అంతమాత్రానికే మెమో జారీ చేయడమేంటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications