ఘరానా దొంగ: భార్యను వదిలేశాడు, టీచర్ను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు
నాలుగేళ్లలో 65 చోరీలు చేసిన ఓ ఘరానా దొంగను హైదరాబాద్ నార్త్జోన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 31 కేసులకు సంబంధించి కేజిన్నర బంగారాన్ని రికవరీ చేశారు.
హైదరాబాద్: నాలుగేళ్లలో 65 చోరీలు చేసిన ఓ ఘరానా దొంగను హైదరాబాద్ నార్త్జోన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 31 కేసులకు సంబంధించి కేజిన్నర బంగారాన్ని రికవరీ చేశారు. నార్త్జోన్ డీసీపీ సుమతి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
సికింద్రాబాద్ సెకండ్ బజార్ డీసీబీ బ్యాంక్ మేనేజర్ హర్ష ఇంట్లో గత సెప్టెంబరులో 12 తులాల బంగారం దొంగతనం జరిగింది. మార్కెట్ పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగతనం చేసింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కోటిపల్లి చంద్రిగా గుర్తించారు.
గురువారం సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం వద్ద చంద్రిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా తాను 65 చోరీలు చేశానని, రెండున్నర కేజీల బంగారం ఎత్తుకుపోయానని చంద్రి వెల్లడించాడు. ఈ మేరకు 31 కేసులకు ఆధారాలను సేకరించి రూ.45 లక్షలు విలువైన కేజీన్నర బంగారాన్ని మార్కెట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చంద్రి గతంలో...
చంద్రి గతంలో మెదక్ జిల్లా ఐడీఏ బొల్లారంలో నివాసం ఉంటూ స్క్రాప్ వ్యాపారం చేసేవాడు. నష్టాలు రావడంతో 2007లో చొరీలు చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఊర్లు మారుస్తూ ఇప్పుడు బీబీనగర్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకుని చోరీలకు పాల్పడుతూ వచ్చాడు.
ఈ ప్రాంతాలే లక్ష్యం...
సికింద్రాబాద్, మేడిపల్లి, రాంపల్లి, దమ్మాయిగూడ, జవహార్నగర్, కుషాయిగూడ ప్రాంతాలను చంద్రి లక్ష్యం చేసుకున్నాడు. ఆయా ప్రాంతాల్లో ఉదయం బైక్ మీద తిరుగుతూ వరుసగా తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించేవాడు. రాత్రి వచ్చి తాళాలను పగులగొట్టి ఇంట్లోకి చొరబడి ఉన్నదంతా ఎత్తుకుపోయేవాడు.
ఒకేసారి ఐదు ఇళ్లు...
చంద్రి ఒకేసారి కనీసం ఐదు ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తాడని, ఒక ఇల్లు పూర్తికాగానే మేడమీదికి ఎక్కి మరో ఇంటిపైకి వెళ్తాడని పోలీసుల విచారణలో తేలింది. ఓ రోజు మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో దాదాపు 14 ఇళ్లను లక్ష్యం చేసుకుని అన్ని ఇళ్లలోనూ చొరబడి సొత్తు కాజేశాడని పోలీసులు గుర్తించారు. ఈ బంగారం మొత్తాన్ని పాన్ బ్రోకర్ల దగ్గర కుదువ పెడుతాడని, కొన్నిసార్లు సగం ధరకే అమ్మేస్తాడని, ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడని వెల్లడైంది.
పాన్ బ్రోకర్ను కూడా...
చంద్రి ఎక్కువగా బీబీనగర్లో శ్రీ అంబిక జ్యువెలర్స్, పాన్ బ్రోకర్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న హిరాలాల్ సిర్వికి అమ్మేశాడని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు హిరాలాల్ సిర్విని అరెస్ట్ చేశారు. చంద్రి తన మొదటి భార్యను వదిలేసి ఓ టీచర్ను ఎత్తుకెళ్లి రెండో పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు ఆ మిస్సింగ్ కేసు కూడా వీడిందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 31 కేసుల మిస్టరీ వీడిందని, మిగతా కేసుల్లో ఆధారాలు లభించాల్సి ఉన్నదని వివరించారు.