గంగిరెద్దుతో ప్రచారం.. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో ఇదే ఇంట్రెస్టింగ్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపిలకు ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రధాన పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులంతా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే తిష్ట వేసి ప్రచారం సాగిస్తున్నారు. అయితే ముఖ్య నాయకుల ప్రచారానికి ధీటుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ ఉనికిని చాటుకోవడానికి వినూత్నంగా ప్రచారాన్ని చేస్తున్నారు.
కాంగ్రెస్ కు ఓటు వెయ్యొద్దని ప్రచారం
ఈ ఉప ఎన్నికల బరిలో మొత్తం 13 మంది నిరుద్యోగ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని తమకు ఓటు వేయాలని వారు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన అస్మా తనకు టార్చ్ లైట్ గుర్తు పైన ఓటు వేయాలని విభిన్నంగా ప్రచారం చేస్తున్నారు.

గంగిరెద్దు సాక్షిగా తనకు ఓటెయ్యాలని విజ్ఞప్తి
పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్న ఆమె ఒక గంగిరెద్దును పట్టుకుని తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. గంగిరెద్దు కు ఓటు వేయండి కానీ కాంగ్రెస్ పార్టీకి వద్దు అంటూ ఆమె చెబుతున్నారు. అంతేకాదు హిందూ పురాణాల ప్రకారం గంగిరెద్దును దేవతగా కొలుస్తారని, అటువంటి గంగిరెద్దు సాక్షిగా తనను గెలిపించాలని ఆమె అభ్యర్థిస్తున్నారు.
టార్చ్ లైట్ కు ఓటేస్తే ఇలా చేస్తానన్న ఇండిపెండెంట్ అభ్యర్థి
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరిని మోసం చేసిందని, అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని ఆమె కోరుతున్నారు. ఇక చీకటిగా ఉన్న సమయంలో టార్చిలైట్ ఎలా అయితే వెలుగుని ఇస్తుందో అదేవిధంగా టార్చ్ లైట్ కు ఓటేస్తే, తాను గెలిస్తే, ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతానని అస్మా తన ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.
కాంగ్రెస్ కు ఓటేస్తే మోసం ఖాయం
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరోమారు మోసపోవడం కంటే తనకు ఓటు వేయడం మంచిదని ఆమె చెబుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, అయినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడం వల్లనే, టామీ ఎన్నికలలో పోటీ చేసినట్టుగా అస్మా చెబుతున్నారు. ఏది ఏమైనా అధికార కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగి ప్రచారాన్ని సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications