జంప్ జిలానీల అనర్హత ఇష్యూ: స్పీకర్ను హైకోర్టు ఆదేశించవచ్చా?
హైదరాబాద్: శాసనసభ్యుల అనర్హతకు సంబంధించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలంటూ శాసనసభ స్పీకర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చా అనే అంశంపై హైకోర్టు బుధవారం సందేహం వ్యక్తం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఉంటే కోర్టు పరిశీలనకు ఇవ్వాలని స్పష్టం చేసింది. తాము లేవనెత్తిన ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమై కోర్టుకు రావాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది.
కోర్టు సమయం ముగియడంతో ఈ వ్యాజ్యాలపై విచారణను గురువారం కొనసాగించనన్నట్లు ధర్మాసనం చేసింది. తెలుగుదేశం పార్టీనుంచి తలసాని శ్రీనివాసయాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్యానాయక్, కాలే యాదయ్య, కోరం కనకయ్య, జి. విఠల్రెడ్డి, వైసీపీ నుంచి ఎమ్మెల్యే మదన్లాల్లు పార్టీలు ఫిరాయించి టీఆర్ఎస్లో చేరారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శాసనసభ స్పీకర్కు ఆయా పార్టీలు ఫిర్యాదు చేశాయి. అయితే, స్పీకర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తమ ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలని స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, సంపత్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

స్పీకర్ పరిశీలనలో ఉన్న అంశాలపై విచారించలేమని హైకోర్టు సింగిల్ జడ్జి స్పష్టం చేశారు తర్వాత పిటిషనర్లు డివిజన్ బెంచ్కు అప్పీలు చేశారు. ఈ అప్పీలు పిటిషన్లు గురువారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోసాలే, జస్టిస్ ఎస్వీ భట్లో కూడిన డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చాయి.
పిటిషనర్ల తరఫున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై పార్టీ ఫిరాయింపుల చట్టంకింద వచ్చిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణీత సమయాన్ని నిర్ణయించి ఈలోగా విచారణ పూర్తి చేయాలని మాయావతి కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని, విచారణకు స్వీకరించిన తర్వాత మూడు వారాల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు అభిప్రాయ పడిందని కోర్టుకు ఆయన తెలిపారు.
సింగిల్ జడ్జి తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ఏసీజే అప్పీలు పిటిషన్లలో ఏమి కోరారో దానికే పరిమితం కావాలని, మెరిట్స్లోకి వెళ్లరాదని అన్నారు. ఇటువంటి సందర్భాలలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని చట్టం ఏం చెబుతుందో చెప్పాలని అడిగారు. పార్టీ ఫిరాయించిన ఒక ఎమ్మెల్యేకు అధికారపార్టీ మంత్రి పదవి కట్టబెట్టిందని, శాసనసభ్యుడుగానే అర్హతలేని వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం చెల్లదన్నారు.
ఈ వాదనలపై స్పందించిన ఏసీజే -అలా ఉండకూడదని ఎక్కడ ఉందో చూపాలని ప్రశ్నించారు. అసలు ఎమ్మెల్యే కాకపోయినా మంత్రిగా ఆరు నెలలు కొనసాగవచ్చని చట్టం చెబుతోందని, అలాంటప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మంత్రిగా మాత్రమే కాదు ముఖ్యమంత్రిగా కూడా ఉండవచ్చునని, ఇప్పటివరకు మీరు చెప్పిన వాదనలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారన్న అంశం ఒక్కటే ఉందని వ్యాఖ్యానించారు.
స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్న వ్యాజ్యాల్లో హైకోర్టు జోక్యం చేసుకోవచ్చని ఎక్కడ ఉందో చూపాలని పిటిషనర్ను ఏసీజే ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యుల్లోని అంశాలను చదవాలని సూచించిన ధర్మాసనం దాని ప్రకారం ఈ వ్యాజ్యాల్లో హైకోర్టు జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదని, వారి కాలపరిమితి మే నెలలో ముగిసినందున మూసివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. దీంతో వ్యాజ్యాలపై విచారణను ధర్మాసనం మూసివేసింది.












Click it and Unblock the Notifications