కొడుకు పెళ్లి కార్డులిచ్చేందుకు వెళ్లి.. ప్రమాదంలో నలుగురు మృతి
కరీంనగర్: జిల్లాలోని తిమ్మాపూర్ మండలం అలుగునూరులో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీపీసీలోని కృష్ణానగర్కు చెందిన కె రవీందర్(55) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, నవంబర్ 29న జరగబోయే తన కుమారుడి వివాహం కోసం ఆయన, ఆయన భార్య సరిత(45) తమ బంధువులకు పెళ్లికార్డులు ఇ చ్చేందుకు హైదరాబాద్ వచ్చారు.
అనంతరం ఇద్దరు బంధువులను తీసుకొని హైదరాబాద్ నుంచి కరీంనగర్కు బయలుదేరారు. అలుగునూరు దగ్గరకు రాగానే కారు అదుపుతప్పి ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నిద్రమత్తు, అతివేగం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. కొడుకు వివాహ వేడుకతో ఎంతో సంబరంగా ఉండాల్సిన బాధితుల ఇంట్లో ఈ ప్రమాదంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.