అమానుషత్వం, 20 కి.మీ. లాక్కెళ్లిన కారు: చెప్పు ఆధారంగా గుర్తింపు
నల్గొండ: నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ రైతు రోడ్డు దాడుతుండగా ఓ కారు ఢీకొట్టింది. దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది. దీంతో అతను మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు రైతు చెప్పుల ద్వారా కారు ఎంత దూరం లాక్కొచ్చిందనే విషయాన్ని గుర్తించారు.
రోడ్డు దాటుతున్న వృద్ధుణ్ని కారుతో ఢీకొట్టాడు..ఆ ధాటికి ఆయన ఎగిరి కారుపై పడిపోయినా, డ్రైవర్ అలానే ఏకంగా 20కి.మీ. ముందుకు తీసుకుపోయాడు. కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ పెద్దాయనను ఆసుపత్రికి తీసుకెళ్లే బదులు.. ఆయన నిండుప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి కారకుడయ్యాడు. అమానవీయతకు అద్దంపట్టే ఈ దుర్ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.
నార్కట్పల్లికి చెందిన వెంకట్ రెడ్డి(73) శనివారం పొలం వద్దకు వెళ్లి, మధ్యాహ్నం ఇంటికి వస్తుండగా.. గ్రామశివారులో కామినేని వై - జంక్షన్ సమీపంలో డివైడర్ దాటుతుండగా హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొంది. ఆ వేగానికి అతను కారు పైనే పడిపోయాడు.
ప్రమాద సమయంలో ఎదురుగా వస్తున్న ఆటో డ్రైవర్ వృద్ధుడి పరిస్థితిని గమనించి... సమీపంలోనే కామినేని ఆసుపత్రి ఉందని, అక్కడికి తీసుకెళ్లాలని సూచించాడు. కానీ కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ఇరవై కిలమీమీటర్ల దూరం ముందుకు వెళ్లాడు.
కారు పైన వెనుకభాగంలోని స్పాయిలర్లో కాలు చిక్కుకుపోవడంతో ఆ రైతు కిందపడకుండా వేలాడుతూ ఉండిపోయాడు. కట్టంగూరు మండలం అయిటిపాములకు కారు చేరుకోగానే స్థానికులు గమనించి కారును అడ్డుకున్నారు. గ్రామస్థులు డ్రైవర్ను నిలదీశారు.
తాను ఆసుపత్రికి తీసుకు వెళ్తున్నానని డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. గాయపడి, కారుపై చిక్కుబడిపోయిన వ్యక్తి మృతి చెందినట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని నార్కట్పల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగ్గానే తీసుకు వస్తే బతికేవాడని చెబుతున్నారు.
ప్రమాదం సమయంలో ఆ కారులో డ్రైవర్తోపాటు మరొకరు ఉన్నారు. వారిద్దరినీ పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని నేషనల్ హైవే పైన ఎక్కడ ప్రమాదం జరిగిందో గుర్తించాలని సూచించగా ప్రమాదస్థలిని చూపారు.
నార్కట్పల్లి శివారులోని కామినేని వై-జంక్షన్ సమీపంలో పడిపోయిన చెప్పు ఆధారంగా మృతుడిని నార్కట్పల్లికి చెందిన వెంకట్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న వ్యక్తులిద్దరూ హైదరాబాద్కు చెందినవారు. వ్యాపార నిమిత్తం సూర్యాపేటకు వెళుతున్నారు. తమకు ఆసుపత్రి తెలియక పోవడం వల్లే అలాగే ముందుకెళ్లామని వారు పోలీసులకు చెప్పారు.