కార్డ్ పొర్టబిలిటీ: ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు
హైదరాబాద్: పౌర సరఫరాల శాఖ తెలంగాణలో మరో సంస్కరణ చేపట్టింది. ఇక నుంచి రేషన్ లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బియ్యం, ఇతర నిత్యావసరాలు పొందొచ్చు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,545 రేషన్ దుకాణాల్లో అమల్లో ఉన్న రేషన్ పోర్టబిలిటీ విధానం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది.
ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకుముందు తమకు కేటాయించిన రేషన్ దుకాణాల్లోనే కార్డుదారులు సరుకులు తీసుకునే వారు. కానీ ఇకనుంచి నచ్చిన చోట సరుకులు పొందొచ్చు.

ముఖ్యంగా ఉపాధి నిమిత్తం స్వగ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఒకే కార్డులో ఉన్న కుటుంబసభ్యులు వేర్వేరు జిల్లాల్లో ఉంటున్నా.. తమ కోటా బియ్యం, ఇతర సరుకులను తాము నివాసముంటున్న ప్రాంతాల్లోనే పొందొచ్చు.
ఉదాహరణకు ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులుంటే.. వరంగల్లో ముగ్గురు, కరీంనగర్లో ఇద్దరు రేషన్ సరుకులను తీసుకోవచ్చు. అవసరమైనపుడే రేషన్కోటా తీసుకోవచ్చు. వరుసగా ఏడాదికాలం కోటా తీసుకోకున్నా కార్డును తొలగించరు. ఈ విధానం అమలు చేస్తున్న క్రమంలో ఆయా దుకాణాలకు 10 నుంచి 15శాతం సరుకులను అదనంగా కేటాయించనున్నారు. దాదాపు 2.75 కోట్ల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందని అంచనా.












Click it and Unblock the Notifications