ఆధార్ సేకరణ, మత విశ్వాసాలను కించపర్చారు: బాబూ గోగినేనిపై 13సెక్షన్ల కింద కేసు నమోదు
Recommended Video
హైదరాబాద్: తమ మనోభావాలను కించపర్చారంటూ పలువురు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హేతువాది బాబు గోగినేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతమంది ఇచ్చిన ఫిర్యాదుతో.. కోర్టు ఆదేశాల మేరకు 13 సెక్షన్ల కింద మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మత విశ్వాలను కించపర్చటం, భారత విదేశాంగ విధానానికి ఆటంకం కలిగించేలా విదేశాల మీద విద్వేషకరంగా వ్యాఖ్యలు చేయటం, గోప్యత పాటించాల్సిన ఆధార్ సమాచారాన్ని బాబు గోగినేని, అతని అనుచరులు వాళ్ల సంస్థల ద్వారా విదేశాలకు అందజేస్తున్నారని, ఇది దేశ భద్రతకు కూడా ప్రమాదంగా మారుతుందని ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులో వెల్లడించారు. హేతువాద నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించారు.
సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్కు బాబు గోగినేని ఫౌండర్గా ఉన్నారని, మలేషియాలో దీనికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. అయితే, హేతువాద సమావేశాలంటూ సభ్యులకు ఆహ్వానం పలికి తప్పనిసరిగా వారి ఆధార్ నెంబర్ను గోగినేని ముఠా తీసుకుంటోందని, ఆ ఆధార్ నెంబర్లను వెబ్సైట్లో బహిర్గతం చేయడం ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయిందని చెప్పారు.
ఇది తమ వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖలో ఇటీవల బాబు గోగినేని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ఆధార్ నెంబర్ తీసుకోవడమే కాకుండా.. ఆ నెంబర్లను వెబ్సైట్లో పెట్టారని ఫిర్యాదులు అందడంతో మాదాపూర్ పోలీసులు బాబు గోగినేనిపై కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో బాబు గోగినేని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం బాబు గోగినేని బిగ్ బాస్-2లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.