టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయంతోనే అలసత్వం: రఘునందన్పై కేసుపై బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు చేయటాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో నిందితులపై కేసు నమోదు చేయని పోలీసులు.. న్యాయం చేయాలని ఉద్యమిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్పై కేసు పెట్టడం సిగ్గుచేటని బండి సంజయ్ మండిపడ్డారు.

టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉందంటూ బండి సంజయ్
బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న ఆసక్తి.. నేరాలకు పాల్పడిన దోషులను అరెస్ట్ చేయడం పట్ల చూపితే ఇప్పటికి న్యాయం జరిగేదని హితవు పలికారు.అత్యాచార ఘటనలో ఆధారాలు ఉన్నా.. దోషులను అరెస్టు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే కేసును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని సంజయ్ ఆరోపించారు.ఈ తరహా ఘటనలు రోజుకోకటి వెలుగు చూడటం.. హైదరాద్ నగరంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమన్నారు బండి సంజయ్.

గొప్పలు చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్ గొంతు మూగబోయిందా: బండి
నేరాలను అరికట్టడంలో తామే నంబర్ వన్ అంటూ గొప్పలు చెప్పుకునే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గొంతు ఎందుకు మూగబోయిందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ ఘటనలపై స్పందించరా? అని నిలదీశారు. ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని.. అసలైన దోషులను శిక్షించే వరకు బీజేపీ ఉద్యమిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. రోజుకో రేప్ కేసు బయటపడుతుందంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని తెలిసిపోతుంది. ఇది ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితననమేనని ధ్వజమెత్తారు బండి సంజయ్.

బాధితురాలి తరపునే.. ఆధారాలు చూపిన వారిపై కేసులా?: రఘునందన్
మరోవైపు, తనపై కేసు నమోదు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై నిర్వహించిన మీడియా సమావేశంలో బాలిక పేరు, ఫొటో, ఊరు పేర్లను తాను చెప్పలేదన్నారు. ప్రెస్మీట్లో వీడియోను ప్రదర్శించారంటూ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో రఘనందన్ పై నమోదైన క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తానూ న్యాయవాదినేనని.. తనకూ చట్టం తెలుసునని రఘునందన్ రావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనపై కావాలనే బురద జల్లుతోందని ధ్వజమెత్తారు. తానెప్పుడూ బాధితురాలి తరపునే మాట్లాడతానని, ఎంఐఎంపై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి బాధ ఎందుకని ప్రశ్నించారు. సహజ మిత్రులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, దాని పరిధిలో మాత్రమే మాట్లాడానని అన్నారు. నిజంగా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో తీసినవాళ్లపై కేసు పెట్టాలన్నారు. తనపై కేసు విషయంలో పోలీసుల యాక్షన్ బట్టే తన రియాక్ష ఉంటుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకుండా తనపై కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications