తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరత: ఎటిఎంల వద్ద చీమల బారుల్లా క్యూలు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నగదు కొరతను ఎదుర్కుంటున్నాయి. దాంతో బ్యాంకులు పొరుగు రాష్ట్రాల నుంచి నగదును తెప్పించుకుంటున్నాయి. గత రెండు నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్తాకథనం ప్రచురితమైంది.
ఎటిఎంల్లో నింపడానికి కూడా డబ్బులు లేక బ్యాంకులు విలవిలలాడుతున్నాయి. నగదు కొరతతో ఎటిఎంల వద్ద ప్రజలు చీమల బారుల్లా క్యూలు కడుతున్నారు. తెలంగాణకు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి నగదు వస్తుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు.
ఎటిఎంల్లో 60 శాతం సమయానికి మాత్రమే డబ్బులు సరిపోతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. కొన్ని ఎటిఎంలు మూడు నెలలుగా మూతపడ్డాయి కూడా. రూ.2000 నోట్ల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. 2017 సెప్టెంబర్ నుంచి రిజర్వ్ బ్యాంకు వాటిని అందించకపోవడమో, కస్టమర్లు తిరిగి వాటిని డిపాజిట్ చేయకపోవడమో జరుగుతోందని అంటున్నారు.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో హైదరాబాదుకు కేరళ మహారాష్ట్రల నుంచి డబ్బులు తెచ్చుకున్నరు. ఎటిఎంల్లో విత్డ్రాలు పెరగడంతో ఆ పని చేశారు. కానీ మార్చిలో అటువంటిదేమీ లేదని అంటున్నారు.
లావాదేవీలను పరిశీలిస్తే వేతన జీవులు నెలలో మొదటి సారి రూ.5000 లేదా రూ.10.000లు తీసుకునేవారని, ఇప్పుడు బ్యాంకులో పడిన వెంటనే మొత్తం వేతనాన్ని అంతా తీసేసుకుంటున్నారని తేలింది. బ్యాంకులు అడిగిన మొత్తంల రిజర్వ్ బ్యాంక్ 50 నుంచి 60 శాతం మాత్రమే ఇస్తున్నట్లు తెలుస్తోంది.