ఓటుకు నోటులో ఏసీబీకి హైకోర్టు షాక్: మత్తయ్య పిటిషన్పై ఓకే
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తన పైన ఉన్న ఏసీబీ కేసును కొట్టివేయాలని నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య పెట్టుకున్న పిటిషన్ పైన విచారణ జరిపేందుకు హైకోర్టు నిర్ణయించింది. ఇప్పటికే ఛార్జీషీట్ దాఖలు చేసినందున ఎఫ్ఐఆర్ కొట్టివేయాలన్న పిటిషన్ చెల్లదని ప్రకటించాలని ఏసీబీ దాఖలు చేసిన మెమోను కొట్టేసింది.
మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్ పైన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర రావు బుధవారం నాడు రహస్య విచారణ చేపట్టారు. ఓటుకు నోటు కేసులో ఛార్జీషీట్ దాఖలు చేశామని, అందువల్ల మత్తయ్య పిటిషన్ పైన విచారణ అవసరం లేదని ఏసీబీ తెలిపింది.
ఛార్జీషీట్ దాఖలును కొట్టివేయాలని ఆయన కోర్టును ఆశ్రయించవచ్చునని, అలాకాకున్నా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని తెలిపింది. ఏసీబీ వాదనతో మత్తయ్య తరఫు న్యాయవాది ఏకీభవించలేదు. చార్జీషీట్ అసంపూర్తిగా ఉందని చెప్పారు. మత్తయ్య తరఫు లాయర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఏసీబీ మెమోను తోసిపుచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసు ఐదారు నెలల క్రితం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో టిడిపి నేత రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్య తదితరులు నిందితులుగా ఉన్నారు.