నోటుకు ఓటు కేసు: చంద్రబాబుపై నమస్తే తెలంగాణ ఆసక్తికరమైన కామెంట్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య రాజీ కుదిరిందని భావిస్తున్న తరుణంలో నమస్తే తెలంగాణ మీడియా ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. నోటుకు ఓటు కేసులో ఆ మీడియా చేసిన వ్యాఖ్య కాస్తా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్కు సంబంధించిన మీడియాగా భావించే నమస్తే తెలంగాణలో ఆ విధమైన వార్తాకథనం రావడం వల్ల దానికి ప్రాధాన్యం చేకూరిందని అంటున్నారు.
ఓటుకు నోటు కేసులో గొంతు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలదేనని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిర్ధారించిందనే వార్తాకథనాన్ని ఇస్తూ గొంతు రేవంత్దే... బాసు కథే తరువాయి, రేవంత్ దొంగే అనే శీర్షికను పెట్టడమే కాకుండా స్టీఫెన్ సన్తో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మాట్లాడినట్లు ఆడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందేనని, ఈ క్రమంలో చంద్రబాబు స్వర నమూనాను కూడా సేకరించాలని ఎసిబి భావిస్తున్నట్లు సమాచారం అంటూ నమస్తే తెలంగాణ మీడియా వ్యాఖ్యానించింది.
తెలుగు రాష్ర్టాలకు ఓ కుదుపు కుదిపేసిన ఓటుకు నోటు కేసు వ్యవహారం కీలక దశకు చేరినట్లు చెప్పవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి ఏసీబీ అధికారులకు దొరికిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో టేపులు నిజమైనవేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ స్పష్టం చేసింది.
ఈ కేసుకు సంబంధించి ఆడియో, వీడియోల్లోని స్వరం రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జెరూసలేం ముత్తయ్య స్వరంతో సరిపోలినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిర్ధారించింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోర్టుకు ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు సమర్పించారు. స్వర నిర్ధారణకు సంబంధించిన నివేదికను తమకు కూడా ఇవ్వాలని ఏసీబీ కోరనుంది.