రేవంత్ కేసులో మరింత మందికి నోటీసులు: తిరుపతి వెళ్లేందుకు సండ్ర అభ్యర్థన
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసులో మరికొంత మంది ప్రముఖులకు త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కిందిస్థాయిలో విచారణ ముగిసిన తర్వాత కేసుతో సంబంధం ఉన్న ఇంకా కొందరు ముఖ్యులపై దృష్టిపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
కేసుతో ప్రమేయం ఉందని భావించిన ముఖ్యుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహాయకుల్ని ఏసీబీ అధికారులు వరుసగా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అనుచరులు అల్లూరి నారాయణరాజు, సైదుల్ని శుక్రవారం ఏసీబీ అధికారులు విచారించారు.
రెండు రోజులక్రితం సీఆర్పీ 160 కింద విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు అందజేయడంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి సైదులు చేరుకున్నాడు. రేవంత్రెడ్డికి ప్రధాన అనుచరుడిగా, గతంలో పీఏగా సేవలందించడంతోపాటు టీడీఎల్పీ కార్యాలయంలోను సైదులు పనిచేశాడు.
సైదులును సుమారు ఏడు గంటలపాటు ఏసీబీ విచారించింది. ఎన్నికల సమయంలో "మీ సారు ఎక్కడకు వెళ్లేవారు, నీవు కూడా అతడితో వెళ్లేవాడివా? ఓటు నోటు వ్యవహారంలో నీ పాత్ర ఏమిటీ" అనే విషయాలపై ఆరా తీసినట్లు తెలిసింది. శనివారం కూడా విచారణకు హాజరుకావాలని సైదులుకు ఏసీబీ అధికారులు సూచించినట్లు తెలిసింది.
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు సభ్యుడిగా ఉన్న తనకు బోర్డు సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతించాలని కోరుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నందున షరతులు సడలించి సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాల్సిందిగా కోర్టును అభ్యర్ధించారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.