రేవంత్ కేసులో మరోషాక్: ఒకే సెల్టవర్ పరిధిలో బాబు, సెబాస్టియన్?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కొత్త విషయం వెలుగు చూసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ఫోన్ చేసినట్లుగా చెబుతున్న చంద్రబాబు, రెండో నిందితుడు సెబాస్టియన్ ఒకే సెల్ టవర్ పరిధిలో నుంచి స్టీఫెన్ సన్కు ఫోన్లు చేసినట్టు ఏసిబి అధికారులు గుర్తించారని తెలుస్తోంది.
ఇది ఈ కేసులో కీలకమైన ఆధారంగా ఉపయోగపడుతుందని ఎసిబి భావిస్తోంది. కాల్ వెళ్లిన టవర్ను ఇప్పటికే ఎసిబి పోలీసులు గుర్తించారు. కాని సెల్ టవర్ పరిధిలో ఉండడం వేరు, మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడడం వేరని, ఫోన్లోని గొంతు బాబుదేనని ఫోరెన్సిక్ పరీక్షలో నిర్ధారణ అయిన వెంటనే, ఒకే సెల్ టవర్ అనే ఆధారం తదుపరి దశలో కీలకం కానుందని ఎసిబి భావిస్తోందని చెబుతున్నారు.
సెబాస్టియన్కు ఏ కాల్ వచ్చినా రికార్డు చేసే అలవాటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇలా రికార్డు చేసే అలవాటు లేనట్లయితే ఈ వివరాలు బయటకు వచ్చేవి కావని భావిస్తున్నారు. సెబాస్టియన్ ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాతనే అనేకమంది వ్యక్తుల ప్రమేయం ఈ కేసులో ఉన్నట్లు వెల్లడైందని అంటున్నారు.
స్టీఫెన్ సన్ ఫోన్ వల్ల అరెస్టైన రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు దొరికాయని తెలుస్తోంది. సెబాస్టియన్ హెచ్టిసి ఫోన్లో మే 23 నుంచి 31వ తేదీ వరకు మాట్లాడిన అన్ని ఫోన్ సంభాషణలు ఉన్నాయని, ప్రస్తుతం పరారీలో ఉన్న జిమీ బాబు కూడా సెబాస్టియన్తో ఫోన్లో మాట్లాడినట్లు రికార్డులు ఉన్నాయని తెలుస్తోంది.