ఓటుకు నోటు: మరో ఇద్దరికి ఎసిబి నోటీసులు, వేం ఇద్దరు డ్రైవర్లకు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. శాసన మండలి ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డి ఇద్దరు డ్రైవర్లకు శుక్రవారం నోటీసులు జారీ చేశారు.
వేం నరేందర్ రెడ్డి తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డికి ఎసిబి నోటీసులు ఇవ్వగా, ఆయన బుధ, గురువారాలు ఎసిబి ఎదుట హాజరైన విషయం తెలిసిందే. వేం నరేందర్ రెడ్డి కూడా ఓసారి ఎసిబి ఎదుట హాజరయ్యారు. ఇప్పుడు వేం డ్రైవర్లకు నోటీసులు అందాయి. సెక్షన్ 160 సిఆర్పీసీ కింద విచారణకు హాజరు కావాలి ఆదేశించింది.
వేం నరేందర్ రెడ్డి తనయుడు కృష్ణ కీర్తన్ను విచారించిన ఎసిబి.. మరోసారి వేం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేయవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు డ్రైవర్లను ప్రశ్నించాక, వీరి నుండి సేకరించిన సమాచారం ఆధారంగా జారీ చేయవచ్చునని అంటున్నారు.
కాగా, ఓటుకు నోటు కేసులో వ్యవహారాల గురించి తనకేమీ తెలియదని, తన ఫోన్తో తన నాన్నే మాట్లాడడాని వేం తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డి ఎసిబి అధికారులకు చెప్పారు.
కృష్ణ కీర్తన్ ఫోన్ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, సండ్రవెంకట వీరయ్య, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ సిన్హాతో మాట్లాడటానికి నేపథ్యమేమిటన్న కోణంలో గురువారం ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇదిలా ఉండగా, గురువారం నాడు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు ఎసిబి కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టి వెళ్లారు. ఆ సమయంలో కృష్ణ కీర్తన్ కార్యాలయంలోనే ఉన్నారు.