అదర్ సైడ్: చంద్రబాబు వాయిస్ టెస్ట్ ఇవ్వాల్సిందేనా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వాయిస్ టెస్ట్ జరపకూడదని ఎఫ్ఎస్ఎల్ అధికారులు భావిస్తున్నట్లు ఓ వర్గం మీడియాలో వార్తాకథనాలు రాగా, మరో వర్గం మీడియాలో వాయిస్ తప్పదంటూ వార్తాకథనాలు వచ్చాయి. ఓటుకు నోటు కేసులో దొరికిన ఆడియోలో వినిపించింది చంద్రబాబు గొంతేనని ఫొరెన్సిక్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది.
మీడియా కథనం ప్రకారం - చంద్రబాబు ఆడియో, రేవంత్ వీడియో రెండింటిలోనూ ఏ రకమైన కట్ పేస్ట్లు లేవని కూడా వారు గుర్తించినట్టు తెలిసింది. తెలంగాణ ఫోరెన్సిక్ అధికారులు హై డిజిటల్ టెక్నాలజీలో వీటిని విశ్లేషించారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ పూర్తి అయినట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో మిగిలిన విశ్లేషణ పూర్తిచేసి ఏసీబీకి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం.
ఓటుకు నోటు కేసులో అతి ముఖ్యమైన ఆడియో వీడియోలను ఏసీబీ ఫొరెన్సిక్ అధికారులు చురుగ్గా సాగిస్తున్నట్లు ఓ తెలంగాణ దినపత్రిక రాసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో మాట్లాడిన ఫోన్ సంభాషణతో పాటు, స్టీఫెన్సన్తో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అతని అనుచరులు సెబాస్టియన్, ఉదయ్ సింహాలు కలిసి చేసిన డీల్ వీడియోను కూడా ఫోరెన్సిక్ నిపుణులు వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నట్లు రాసింది.
దర్యాప్తు అవసరాల దృష్ఠ్యా ఈ ఆడియో, వీడియోల్లో ఏదైనా ఎడిట్, కాపీ, పేస్ట్ లాంటి అంశాలు ఉన్నాయా? అనే కోణంలో ముందుగా నివేదిక ఇవ్వాలని ఏసీబీ కోరిందని, ఈ కోణంలో ఫోరెన్సిక్ సైంటిఫిక్ నిపుణులు ఇప్పటికే 90 శాతం దర్యాప్తు పూర్తి చేశారని వ్యాఖ్యానించారు. మరో రెండు రోజులు విశ్లేషణ జరిపి మొదటి దశ ప్రాథమిక నివేదికను ఏసీబీకి అందజేయనున్నారు. కేసు ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని విశ్లేషణలో ఎక్కడ అపోహలు తలెత్తకుండా మైక్రో లెవల్స్ నుంచి వీటిని అధ్యయనం చేస్తున్నారు.
మీడియా కథనాల ప్రకారం - ఫొరెన్సిక్ నివేదిక అనంతరం ఏసీబీ విచారణను వేగవంతం చేస్తుంది. ఇవి కట్, పేస్టు కావని ప్రాథమికంగా తేలడంతో రెండోదశలో ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులతో పాటు నిందితులకు నోటీసులు ఇచ్చి వారికి వాయిస్ టెస్ట్ నిర్వహించనుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో మాట్లాడిన చంద్రబాబు వాయిస్ రికార్డు కూడా తప్పనిసరి కానుంది. ఏసీబీ అధికారులు ఈ వారంలో చంద్రబాబుకు వాయిస్ టెస్ట్ కోసం నోటీసులను జారీ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది.
చంద్రబాబుతో పాటు ఇటు వీడియోకు సంబంధించి ఇప్పటికే జైలులో ఉన్న రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్సింహాల వాయిస్ రికార్డులను కూడా ఫోరెన్సిక్ విభాగం పరీక్షిస్తుందని ఓ ప్రముఖ తెలంగాణ దినపత్రిక రాసింది. ఆ తర్వాత సూత్రధారితో పాటు మరికొందరి అరెస్టులకు ఏసీబీ తాజా చిట్టాను సిద్ధం చేస్తుందని ఆ పత్రిక రాసింది.