రాజధాని, సెక్షన్ 8: బాబు వాదనలకు కెసిఆర్ కౌంటర్ ఇలా..
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని, సెక్షన్ 8, జ్యురిడిక్షన్ వంటివాటిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న వాదనలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బుధవారం రాత్రి మీడియా సమావేశంలో సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. చంద్రబాబు వాదనలను ఖండించారు.
హైదరాబాద్పై పదేండ్లు తనకు హక్కు ఉందని చంద్రబాబు చెప్పడాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. ఇది పదేండ్లు ఫెసిలిటేటింగ్ క్యాపిటల్ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. కావాలంటే విభజన చట్టాన్ని చదువుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. అహంకారం, అరాచకంతో మాట్లాడున్న చంద్రబాబు ఆటలు సాగబోవని హెచ్చరించారు. ఇక్కడ చంద్రబాబు కేవలం ఒక గెస్ట్ సీఎం మాత్రమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.
"మాట్లాడితే కామన్ కేపిటల్ అంటవ్. కామన్ క్యాపిటల్ ఏంటి? ఇది ఫెసిలిటేటింగ్ క్యాపిటల్. అది పదేండ్ల వరకూ ఉమ్మడి రాజధాని కాదు.. పదేండ్లు మించకుండా ఉమ్మడి రాజధాని. చట్టం చదువుకో. నీ విజ్ఞత ఏమైపోయింది? నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఒక గెస్ట్ చీఫ్ మినిస్టర్. అక్కడ మీ కార్యాలయాలు ఉండయి కాబట్టి..కట్టుకునే వరకూ కల్పించిన వెసులుబాటు. నీకు హక్కుగాదు. హైదరాబాద్ మీద నీ జురిడిక్షన్ ఉండదు" కెసిఆర్ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.

"చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేది ఒక టెరిటోరియల్ పోస్టు. డీజీపీ పోస్టు టెరిటోరియల్ పోస్టు. ఏపీ డీజీపీ ఏపీ టెరిటోరియల్లోనే పని చేయాలి. ఏపీ చీఫ్ మినిస్టర్ టెరిటరీ ఆంధ్రప్రదేశ్. అంతే కానీ తెలంగాణ రాష్ట్రం కాదు. మీరు రాజధాని నిర్మించుకునేంత వరకూ ఉమ్మడి రాజధాని అనేది ఒక ఫెసిలిటీ మాత్రమే. అది ఒక గౌరవంతో నీకిచ్చిన మర్యాద. దాని పేరుతో నువ్వు తెలంగాణనే శాసిస్తననుకుంటవా? ఇక్కడ ఒక గవర్నమెంటు ఉంది. ఒక పద్ధతుంది. ఇక్కడకొచ్చి అధికార పార్టీ ఎమ్మెల్యేలనే కొని నేను రాజకీయం చేస్తననుకుంటే ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చుంటారు! నేను ఎమ్మెల్యేలను కొంట.. మీరు సహకరించాలి.. ఊరుకుంటారా" అని కెసిఆర్ అన్నారు.
"వారు ఖర్మకాలి సెక్షన్ 8 పెట్టినా.. ఏసీబీ ఆ సెక్షన్లోకి రాదు. ఇదంతా చంద్రబాబు ఆడే డ్రామా. ఆధిపత్యం. దాదాగిరి. ఏపీ పోలీసు ఇక్కడ ఏమీ అధికారం చెలాయించడానికి లేదు. ఎవరైనా సీఎం పక్క రాష్ర్టానికి వెళితే అక్కడి ప్రభుత్వం సెక్యురిటీ కల్పిస్తుంది. చెన్నైకి పోతే తమిళనాడు ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది. ఇవన్నీ కాదు. ఫస్ట్ నువ్వు దొరికిన సంగతి చెప్పు. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడు. నీ అంతట నీవే సరెండర్ అవుతావా? స్టేట్మెంట్ ఇస్తావా? నిర్ణయం నీదే. మిగతావన్నీ తర్వాత మాట్లాడుదాం" అని ఆయన అన్నారు.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స్టన్తో చంద్రబాబు మాట్లాడినట్లు చెబుతూ వస్తున్న ఆడియో రికార్డ్ లీక్పై కూడా కెసిఆర్ మాట్లాడారు. "ఆ గొంతు చంద్రబాబునాయుడితో కాదో ఆయన మొదట చెప్పాలి. దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? డబ్బులు ఇచ్చారా? లేదా? వాళ్ల ఎమ్మెల్యే రెడ్హ్యాండెండ్గా పట్టుబడ్డారా? లేదా? స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడారా? లేదా? ఇవన్నీ ఆయన ఎందుకు చెప్పడం లేదు?" అని కెసిఆర్ అడిగారు.












Click it and Unblock the Notifications