ఓటుకు నోటు కేసు, ఇదీ అసలు విషయం!: 'చంద్రబాబును ఎవరూ ఏం చేయలేరు'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి రావడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజేసింది. ఏసీబీ పనితీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో నాలుగైదు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఓటుకు నోటుపై చర్చించారు. ఆ కేసుతో పాటు గత ప్రభుత్వాల హయాంలో నమోదు చేసిన కీలకమైన కేసులపై చర్చించారు.
చదవండి: అన్ని వివరాలతో చర్చిద్దాం!: కేసీఆర్, ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం, ఏం జరుగుతోంది?
సీఐడీ, విజిలెన్స్ - ఎన్ఫోర్స్మెంట్ వద్ద పెండింగ్లో ఉన్న ముఖ్య కేసులు అందులోనూ రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటన్నింటిపైనా ఆరా తీశారు. ఓటుకు నోటు కేసు ప్రస్తుత స్థితిగతులను అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. ఈ కేసు నుంచి తనను తప్పించాలని నిందితుడు మత్తయ్య చేసిన విజ్ఞప్తిని మన్నిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనికి అభ్యంతరం తెలుపుతూ ఏసీబీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
చదవండి: ఓటుకు నోటులో ఏంలేదని కోర్టే చెప్పింది, ఏం చేస్తారో చూద్దాం, బాబుపై జగన్ కుట్ర: టీడీపీ షాకింగ్
మత్తయ్య పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగులో
ప్రస్తుతం ఈ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ వివరాలన్నీ ఏసీబీ అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. దీనికి సంబంధించిన పలు ధ్రువపత్రాలను సీఎంకు చూపించారని సమాచారం. దీనిపై తదుపరి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిపై పూర్తి వివరాలతో మళ్లీ చర్చిద్దామని కూడా చెప్పారు. నామినేటెడ్ ఎమ్మెల్యేతో మాట్లాడిన వివరాలకు చెందిన ఫోరెన్సిక్ రిపోర్ట్ అంశాలను కేసీఆర్కు వివరించారని తెలుస్తోంది.
పలువురి అనుమానాలు
ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబుకు చెడిన నేపథ్యంలో ఈ కేసు తెరపైకి వచ్చిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు వల్ల మోడీకి జరిగిన నష్టాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు, మోడీ - కేసీఆర్ కలిసి కుట్రపూరితంగా దీనిని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
చంద్రబాబును ఎవరూ ఏం చేయలేరు
అదే సమయంలో ఓటుకు నోటు కేసుతో చంద్రబాబుకు ఏం సంబంధం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాబట్టి సమీక్ష నిర్వహించుకుంటే తమకు వచ్చే ఇబ్బందేమీ లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైయస్ హయాంలో చంద్రబాబుపై 62 కేసుల్లో విచారణ జరిపించినా ఏం చేయలేకపోయారన్నారు. ఓటుకు నోటు వేరే వ్యక్తులపై ఉందని, ఆ విధంగా కేసీఆర్ సమీక్షించి ఉండవచ్చునని, దీంతో తమకు పోయేదేమీ లేదన్నారు. దీనిపై హైకోర్టు కూడా ఓ జడ్జిమెంట్ ఇచ్చిందని, ఏం జరుగుతుందో చూద్దామన్నారు.
అసలు విషయం ఇదీ!
భేటీ సందర్భంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను సీఎం కేసీఆర్కు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచంద్ర రావు సమర్పించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగులో ఉన్న ఈ కేసు త్వరలో హియరింగ్కు రానుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్టాండును ఫైనలైజ్ చేసేందుకే కేసీఆర్ ఈ సమీక్ష చేశారని అంటున్నారు. కేసులో ఓ నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఫిబ్రవరిలో సీజేకు ఓ లేఖ రాశారు. తాను అప్రూవర్గా మారుతానని చెప్పారు. మోడీతో చంద్రబాబుకు చెడినందున కేసీఆర్ సమీక్ష చేస్తున్నారనడంలో అర్థం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అప్పట్లో రాజకీయ దుమారం
కాగా, 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు లంచం ఇవ్వజూపారన్న అభియోగంపై రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు 2015 మే 31న అరెస్ట్ చేశారు. ఇందులో చంద్రబాబు పాత్ర కూడా ఉందనేది ఏసీబీ అభియోగం. న్యాయస్థానంలో దాఖలు చేసిన అభియోగపత్రంలో చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించారు. ఈ కేసు అప్పట్లో రాజకీయంగా పెనుదుమారం రేపింది.
అందుకే ఓటుకు నోటు తెరపైకి అని విహెచ్
సమస్యలపై దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ ఓటుకు నోటు అంశాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నేత వి హనుమంత రావు ఆరోపించారు. రైతు బంధు అంటే రైతులకు సంకెళ్లు వేయడమా అన్నారు. ఓటుకు నోటుపై తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్పందిస్తారని చెప్పారు. అన్ని చూసుకున్నాకే రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారనేది తన అభిప్రాయం అన్నారు. రైతు బంధు పథకం ప్రారంభోత్సవానికి రావొద్దని అఖిలేష్ యాదవ్, స్టాలిన్, మమతా బెనర్జీలకు లేఖ రాస్తానని చెప్పారు.