హైకోర్టు చెప్పింది, అందుకే: కోర్టుకు రాని రేవంత్, రావాల్సిందేనన ఏసీబీ కోర్టు
హైదరాబాద్: ఆగస్టు 3వ తేదీన న్యాయస్థానానికి హాజరు కావాలంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో నిందితుల పైన సోమవారం కోర్టులో విచారణ జరిగింది.
రేవంత్ రెడ్డి కోర్టుకు గైర్హాజరయ్యారు. మిగతా నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి మాత్రం గైర్హాజరయ్యారు. న్యాయస్థానంలో విచారణ సందర్భంగా హాజరు కావాల్సి ఉంది. రేవంత్ గైర్హాజరు కావడంపై ఏసీబీ న్యాయస్థానం తప్పుపట్టింది.
హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్లో హైదరాబాదుకు రావొద్దని ఆదేశాలు ఉండటం వల్లే తాను కోర్టుకు రాలేకపోతున్నానని రేవంత్ తరఫు న్యాయవాదులు ఎసిబి కోర్టులో మెమో దాఖలు చేశారు. బెయిల్ పైన ఉన్నప్పటికీ తప్పనిసరిగా కోర్టుకు రావాల్సిందేనని ఏసీబీ న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఏ 2 సెబాస్టియన్, ఏ 3 ఉదయ్ సిన్హాలు కోర్టుకు వచ్చారు. ఛార్జీషీటు వేసిన తర్వాత కోర్టుకు రావాలని అప్పటి వరకు మినహాయింపు ఉంటుందని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 3న కోర్టుకు రేవంత్ హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు.
సండ్ర బెయిల్ పిటిషన్ పైన తీర్పు వాయిదా
సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్ పైన తీర్పును ఏసీబీ న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసంది. ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. అనంతరం న్యాయమూర్తి బెయిల్ పైన తీర్పును రేపటికి వాయిదా వేశారు.